Dil Raju: తెలుగు టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఇందూరు నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారా? కాంగ్రెస్ తరపున ఆయన బరిలో దిగనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం నిజామాబాద్ కాంగ్రెస్లో వినిపిస్తోంది.
గత ఎన్నికల్లోనే తమ నేతను ఎంపీగా పోటీ చేయాలని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినా.. కుదరలేదని, ఈసారి తమ నాయకుడైన దిల్ రాజు.. ఎంపీగా పోటీచేసి, గెలిచి తీరతాడని ఆయన అనుచరులు చెబుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్.. రెండు పార్టీలతో సత్సంబంధాలున్న తమ నేతకు పార్టీలకు అతీతంగా ఓట్లు పడతాయని వారు భావిస్తున్నారు.
ఈ స్థానంలో ఉండటం రెడ్డి సామాజిక వర్గపు ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో బాటు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హాత్ సే హాత్ యాత్ర నిజామాబాద్ రూరల్ పరిధిలో సాగిన వేళ.. దిల్ రాజు తాను నిర్మించి, నిర్వహిస్తున్న వేంకటేశ్వర ఆలయానికి రేవంత్ రెడ్డిని ఆహ్వానించి, ఆయనతో ప్రత్యేక పూజలు చేయించారని వారు గుర్తు చేస్తున్నారు.
మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఇందూరు టికెట్ను ఆశిస్తున్నవారిలో ఉన్నారు. వీరిలో షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్, జీవన్ రెడ్డి జగిత్యాల స్థానాల నుంచి ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని అందుకోలేకపోయారు.
మొత్తానికి దిల్ రాజు రాక వార్తతో.. నిజామాబాద్ పార్లమెంటరీ స్థానంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయనే సంగతి అర్థమవుతోంది.