Year Ender 2023: ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న ప్రతిసారి దాని ఉపయోగాలతోపాటు మిస్ యూజెస్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో డీప్ఫేక్ టెక్నాలజీ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరిలోనూ కలవరం కలిగిస్తోంది. ఈ డీప్ఫేక్ వీడియోలు ఆన్లైన్ ప్రపంచంలో అతిపెద్ద ముప్పుగా అవతరిస్తున్నాయి. 2023లో సినీ, రాజకీయ ప్రముఖులు దీని బారిన పడటం సంచలనంగా మారింది. అయితే ఈ ఏడాది దీని బారిన పడిన సెలబ్రెటీలు ఎవరో తెలుసుకుందాం.
డీప్ఫేక్స్ అనేవి డీప్ లెర్నింగ్ అనే ఒక రకమైన AI టెక్నాలజీ ఆధారంగా క్రియేట్ అవుతాయి. ఈ డీప్ లెర్నింగ్ కొత్తగా వీడియోలను క్రియేట్ చేయగలదు లేదా మార్చేయగలదు. ఈ టెక్నాలజీతోనే ఇటీవల ప్రముఖ సినీనటి రష్మిక మందన్న వీటికి బాధితురాలు అయింది. జరా పటేల్ అనే యువతి ముఖాన్ని రష్మిక ఫేక్ లాగా మార్చేసి, అసభ్యకరంగా కనిపించే డీప్ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. దీన్ని ఆన్లైన్లో షేర్ చేశారు. అయితే చాలామంది అందులో ఉన్నది రష్మిక అని నమ్మారు. కానీ చివరికి అసలు సంగతి తెలిసి షాక్ అయ్యారు. దీనిపై రష్మిక చాలా బాధపడ్డారు.
ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని కోరారు. సాంకేతికతను ఇలా దుర్వినియోగం చేస్తారనుకోలేదన్నారు. ఇక ఈ మార్ఫింగ్ వీడియోపై అమితాబ్ కూడా స్పందించారు. దీన్ని సీరియస్గా తీసుకొని దీనికి కారణమైన వారిని శిక్షించాలని కామెంట్ పెట్టారు. ఆయనతోపాటు నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్, చిన్మయి తదితరులు ఈ చర్యను ఖండించారు.
సోషల్మీడియాలో నటి రష్మిక డీప్ఫేక్ వీడియో ఘటన మరవక ముందే ఆకతాయిలు మరో హీరోయిన్ను టార్గెట్ చేశారు. బాలీవుడ్ నటి కాజోల్పై డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. ‘గెట్ రెడీ విత్ మీ’ అంటూ ఓ వీడియో సృష్టించారు. కాజోల్ డ్రెస్ ఛేంజింగ్ వీడియో అంటూ దీనిని నెట్టింట షేర్ చేశారు. ఇది నెట్టింట వైరల్గా మారడంతో.. పలువురు ఆందోళన వ్యక్తంచేశారు. ఫేక్ వీడియోలతో సినీతారలను టార్గెట్ చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఆ తర్వాత అలియా భట్ కూడా ఈ ఫేక్ వీడియోల బారిన పడింది. దీనిపై స్పందించిన అలియా.. ‘ఎక్కడ మంచి ఉంటుందో అక్కడే చెడు కూడా ఉంటుంది. సమస్యల వల్ల బాధ పడకూడదు. పరిష్కారాన్ని వెతకాలి. ఏఐ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఉంది. కొన్ని రంగాలకు ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. సాంకేతిక అభివృద్ధిలో ఇది కూడా ఒక భాగం. డీప్ ఫేక్ బారిన పడకుండా కొత్త చట్టాలను కూడా తేవాలి’’ అంటూ తెలిపింది. ఇక ఆమెతోపాటు నటి కత్రినా కైఫ్ కూడా దీని బారిన పడ్డారు. ఆమె నటించిన ‘టైగర్3’లోని టవల్ ఫైట్లో ముఖాన్ని మార్ఫింగ్ చేశారు.
అలాగే, ప్రియాంక చోప్రా వాయిస్నూ సైబర్ నేరగాళ్లు వదల్లేదు. గతంలో ఆమె మాట్లాడిన ఓ వీడియోలో ఆమె ముఖం మార్చకుండా అందులోని వాయిస్ను మార్చారు. ఆమె ఓ నకిలీ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నట్లు లిప్సింక్ చేశారు. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫైర్ అయ్యారు. అయితే ఈ డీప్ఫేక్ సినీ తారలకే పరిమితం కాలేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్కి కూడా ఎదురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. క్రికెటర్ శుభ్మన్ గిల్తో సారా టెండూల్కర్ ఉన్నట్లు మార్ఫింగ్ చేసిన ఫొటోలను ఆకతాయిలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై స్పందించిన సారా.. తన డీప్ఫేక్ వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయినట్లు తెలిపారు.
స్పందించిన కేంద్రం..
సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజు చంద్రశేఖర్.. మార్ఫింగ్ ఓ ప్రమాద చర్యగా అభివర్ణించారు. ఇలాంటి వీడియోల అరికట్టే బాధ్యత సోషల్ మీడియా సంస్థలదేనని ట్వీట్ చేశారాయన. ఎవరైనా కమ్యూనికేషన్ పరికరం లేదా కంప్యూటర్ రిసోర్స్ వినియోగించి వ్యక్తులను మోసం చేస్తే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా పడుతుందని సోషల్మీడియా ప్లాట్ఫాంలకు కేంద్రం గుర్తుచేసింది.
గుర్తించడమెలా..?
ఇలాంటి దుర్మార్గాలను అడ్డుకోవడానికి ఇప్పుడిప్పుడే కొన్ని టూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటి వీడియోల్లో ముఖ కవళికలు, చూసే తీరులో తేడాలను గుర్తించొచ్చు. కనిపించే వీడియో బ్యాగ్రౌండ్ కూడా భిన్నంగా, కృత్రిమంగా సృష్టించినట్లు కనిపిస్తుంది. ఏదేమైనా సోషల్ మీడియాలో కనిపించే వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.