PM Modi : ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఆద్యాత్మిక నగరంలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఎయిర్పోర్టును ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
PM Modi : ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆద్యాత్మిక నగరంలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఎయిర్పోర్టును ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22న చరిత్రలో విశిష్ఠమైన రోజుగా నిలుస్తుందన్నారు. ఆ రోజున ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని దేశ ప్రజలను మోదీ పిలుపునిచ్చారు. అయోధ్య విమానాశ్రయానికి.. త్రికాలదర్శి అయిన మహర్షి వాల్మీకి పేరు పెట్టడం జన్మధన్యంగా భావిస్తున్నాన్నారు. రోజుకు 10 లక్షల మందికి సేవలు అందించేలా ఈ ఎయిర్పోర్టును నిర్మించామని మోదీ తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ లో రద్దీ మేరకు రహదారులు పూర్తిగా విస్తరిస్తామన్నారు. అయోధ్యధామ్లో ఎక్కడ చూసినా రామనామం వినిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని వసతులతో టౌన్షిప్లు నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు.
2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. హిందుస్థాన్ చరిత్రలో జనవరి 22 విశిష్ఠమైన రోజుగా చరిత్రలో నిలిచి పోతోందని మోదీ జోస్యం చెప్పారు. శ్రీ రాముడు ఒకప్పుడు రామ్ లల్లా టెంట్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు ఆయనకు పక్కా ఇంటిని అత్యంత సుందరంగా నిర్మించామని ఇందుకు గర్విస్తున్నానని మోడీ తెలిపారు. దేశంలో శ్రీ రాముడి మందిరంతో పాటుగా 4 కోట్ల మందికి మేం పక్కా గృహాలు కట్టించి ఇచ్చామని మోదీ తెలిపారు.
ఈ సందర్భంగా భక్తులకు ప్రధాని కీలక సూచనలు చేశారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించాలని అందరూ కోరుకుంటారన్నారు. కానీ, అది అందరికీ సాధ్యపడదని మీకు తెలుసన్నారు. అందుకే, రద్దీ దృష్ట్యా జనవరి 22న భక్తులు అయోధ్యకు రావొద్దని మోదీ సూచించారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 23 నుంచి జీవితాంతం శ్రీరాముడిని దర్శించుకోవచ్చన్నారు. భక్తులు ఇబ్బంది పడకూడదనే ఈ సూచన చేస్తున్నట్లు మోడీ తెలిపారు. అంతకు ముందు ప్రధాని రూ.15,700కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.