Egg Price: వారాంతం వచ్చిందంటే.. నాన్ వెజ్ ఉండాల్సిందే. ముక్కలేకపోతే ముద్దదిగని నాన్ వెజ్ ప్రియులెందరో ఉన్నారు. కార్తీకమాసం పూర్తయిందో లేదో.. చికెన్ ధరలు పెరిగిపోయాయి. మటన్ సంగతైతే చెప్పనక్కర్లేదు. సామాన్యుడు ఆ వైపు చూస్తే.. జేబుకు చిల్లుపడినట్లే. చికెన్ కూడా కొనలేని వారు.. కోడిగుడ్లనే నాన్ వెజ్ గా తింటారు. ఇప్పుడు వాటి ధరలు కూడా అకస్మాత్తుగా పెరిగిపోయాయి.
గతంలో డజన్ కోడిగుడ్ల ధర రూ.66 ఉంటే.. ఇప్పుడు రూ.84కు పెరిగింది. అంటే ఒక్క గుడ్డు ధర రూ.7 పలుకుతోందనమాట. కోడిగుడ్లలో ప్రొటీన్ ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతిరోజూ వీటిని తింటుంటారు. వారంరోజుల్లోనే డజన్ కోడిగుడ్లపై రూ.18 రూపాయలు పెరగడంపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కోడిగుడ్ల ధర అమాంతం పెరగడానికి కారణం.. కోళ్ల దాణా ధరలు పెరగడమేనని వ్యాపారులు చెబుతున్నారు. కిలో రూ.15-రూ.17 వరకు ఉంటే.. ఇప్పుడు కిలో దాణా ధర రూ.28కి పెరిగింది. దాణా ఖర్చులు పెరగడంతోనే గుడ్డు ధరలను పెంచాల్సి వచ్చిందని కోళ్ల ఫారాల నిర్వాహకులు తెలిపారు. దాణా ధరల పెరుగుదల, డిమాండ్ కు తగిన గుడ్ల ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెంచినట్లు వివరించారు.