Andhra Pradesh: అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ చేపట్టిన సమ్మె శనివారం 19వ రోజుకు చేరుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యాప్తంగా వివిధ రకాలుగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నేడు పలు చోట్ల మంత్రుల ఇంటి ముట్టడికి ప్రయత్నించారు
Andhra Pradesh: అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ చేపట్టిన సమ్మె శనివారం 19వ రోజుకు చేరుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యాప్తంగా వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నేడు పలు చోట్ల మంత్రుల ఇంటి ముట్టడికి ప్రయత్నించారు.
అంగన్వాడీలు గుంటూరులోని మంత్రి విడదల రజిని ఇంటిని ముట్టడించారు. దాదాపు నాలుగు నియోజకవర్గాల నుంచి అంగన్వాడీలు అక్కడ చేరుకున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమకు జీతాలు పెంచి గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు మంత్రి రజని. సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అంగన్వాడీలు ఆందోళనకు గురికావొద్దని , ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు.
అంగన్వాడీలు ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి సురేష్ ఇంటిని సైతం ముట్టడించారు. మంత్రి సురేష్ ఇంటి ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, అంగన్వాడీల మధ్య తోపులాట జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
మంత్రి ఉష శ్రీచరణ్ ఇంటి ముట్టడికి కూడా అంగన్వాడీలు యత్నించారు. పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళుతున్న అంగన్వాడీలను నాలుగో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివారు ప్రాంతంలో వాహనాలను నిలిపి అంగన్వాడీలను అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. దీంతో అంగన్వాడీలు స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. మరోవైపు విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడికి అంగన్వాడీలు ప్రయత్నించారు.
తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటిని ముట్టడించడానికి వెళ్తున్న అంగన్వాడీలను వెస్ట్ చర్చి కూడలి వద్ద పోలీసులు అడ్డుకున్నారు . దీంతో రోడ్డుపైనే బైఠాయించి తమ డిమాండ్ లు నేరవేర్చాలని ధర్నా చేశారు. రోడ్డుపై అంగన్వాడీలు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరిచేందుకు పోలీసులు దారి మళ్లించారు.