Test Team Of The Year 2023 : అందరికీ పరిచయం అక్కర్లేని పేరు హర్షా భోగ్లే. ప్రముఖ కామెంటేటర్ గా ఆయన అందరికీ సుపరిచితుడు. క్రికెట్ పై అపారమైన అనుభవం ఆయన సొంతం. ఏ ప్లేయర్, ఏ సంవత్సరంలో ఏ జట్టు మీద ఎన్ని పరుగులు చేశాడు? అనేవి ఆయన ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. ఒక్క మన ఇండియా ప్లేయర్లే కాదు, క్రికెట్ ఆడే అన్ని దేశాల క్రికెటర్ల వివరాలు ఆయనకు కరతలామలకం అని చెప్పాలి.
ఇప్పుడాయన టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023ను ప్రకటించాడు. ఈ ఏడాది టెస్టులు ఆడిన జట్లు, అందులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ప్లేయర్లను తీసుకుని ఒక జట్టుని ప్రకటించాడు. అందులో టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్లుగా నిలిచిన రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఇద్దరినీ ఎంపిక చేయలేదు. దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇంతకీ తను ప్రకటించిన టీమ్ లో ఇంగ్లండ్ నుంచి నలుగురు ప్లేయర్లను ఎంపిక చేశాడు. ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు, న్యూజిలాండ్ నుంచి ఇద్దరికి , భారత్ నుంచి ఇద్దరికి మాత్రమే చోటుదక్కింది. అయితే వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో 2023లో టెస్ట్ మ్యాచ్ లు చాలా తక్కువ జరిగాయి.
ఇంగ్లాండ్ జట్టు ఆశించిన విజయాలు సాధించకున్న అందులో ఆటగాళ్లు మాత్రం అందరినీ ఆకట్టుకున్నారు. హర్షా భోగ్లే ఎంపిక చేసిన ఆ నలుగురు ఎవరంటే వరుసగా హ్యారీ బ్రూక్, జోరూట్, జాకీ క్రాలీ, స్టువర్ట్ బ్రాడ్ ఉన్నారు.
ఈ ఏడాది టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఓపెనర్గా ప్రకటించాడు. తనతో పాటు మిచెల్ స్టార్క్, జోష్ హజెల్వుడ్లను ఎంపిక చేశాడు.
ఇక భారత్ నుంచి స్పిన్ ఆల్రౌండర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేశాడు. న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్, టామ్ బ్లండెల్ లను తీసుకున్నాడు.
అయితే ఈ ఏడాది వన్డేల్లో దుమ్ము రేపిన రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలను తీసుకోలేక పోవడంపై హర్షా భోగ్లేపై అభిమానులు విమర్శలు గుప్పించారు. వారిద్దరిని ఎందుకు ఎంపిక చేయలేదో సమాధానం చెప్పాలని అన్నారు. అయితే వీరిద్దరూ కూడా టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ లను మరిచిపోయారని, టీ 20, వన్డేల తరహాలోనే ఆడుతున్నారని కొందరు కామెంట్ చేస్తున్నారు. అందుకే సెలక్ట్ చేసి ఉండకపోయి ఉండవచ్చునని కూడా అంటున్నారు.