Nandyal : చనిపోయిన తన తల్లిని దుర్భాషలాడినందుకు కక్షగట్టి సొంతం బామర్దినే కడతెర్చాడు ఓ వ్యక్తి . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లాలోని చాగలమరి గ్రామానికి చెందిన సుభాన్ అనే వ్యక్తి తల్లి చాలా రోజుల కిందట ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే సుభాన్ అత్త కొడుకు అస్లాం మద్యం తాగినప్పుడల్లా చనిపోయిన అత్తను తిడుతూ ఉండేవాడు. సుభాన్ చాలా రోజులు భరించాడు. అస్లాం మాటలు తీరం దాటిపోవడంతో సుభాన్ కక్ష పెంచుకున్నాడు.
నాలుగు రోజుల కిందట ఓ కొత్త కత్తిని కొన్నాడు. ఎప్పటిలాగే మందు సిట్టింగ్ వేసేందుకు సుభాన్, అస్లాం ,అతని స్నేహితుడు ముగ్గురు కలిసి ఇంటి మిద్దెపై కూర్చున్నారు. మద్యం సేవిస్తున్న సమయంలో అస్లాం మళ్లీ సుభాన్ తల్లి గురించి తీవ్రమైన పదజాలంతో దుర్భాషలాడాడు. ఇక తట్టుకోలేని సుభాన్ ఇదే సమయం అనుకొని అస్లాం కళ్లల్లో కారంపొడి కొట్టి తన వెంట తెచ్చుకున్న కొత్త కత్తితో మెడమీద, కడుపులో తీవ్రంగా దాడి చేశాడు.
దాంతో అస్లాం అక్కడికక్కడే రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. శనివారం ఉదయం అస్లాం తల్లి నజీమున్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాగలమర్రి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అస్లాంను దారుణంగా హత్య చేసిన సుభాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.