Indira Gandhi : అది నవంబరు 1983. ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఉన్నారు. ఆ సమయంలోనే గోవాలో చోగం (CHOGM) సదస్సు జరుగుతోంది. వరల్డ్ టూరిజం మ్యాప్లో గోవాకు ప్రత్యేక స్థానం కల్పించాలనే ఎజెండాను నాడు.. భారత్ ఆ సమావేశంలో ఉంచింది. ఈ కార్యక్రమానికి వచ్చిన 40 కామెన్వెల్త్ దేశాల అధినేతలందరికీ గోవాలోని తాజా హోటల్లో వసతి,ఆతిథ్య ఏర్పాటు చేశారు. ఇక.. నాయకులకు అందించే వంటకాల మెనుతో సహా ఇందిరాగాంధీ భోజన మెనూ కూడా ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చింది.
ప్రధాని ఇందిరాగాంధీ బ్రేక్ఫాస్ట్గా బొప్పాయి ముక్కలు తీసుకుంటారని ఆ మెనూలో ఉంది. అప్పటి గోవా తాజ్ హోటల్ చీఫ్ చెఫ్.. సతీష్ అరోరా… మంచి బొప్పాయిలున్నాయా అంటూ స్టోర్ రూమ్కి వచ్చి చూశారు. కానీ.. అక్కడ కాగితాల్లో చుట్టిన పచ్చి బొప్పాయిలే కనిపించాయి. ఒక్కటైనా పండినది ఉన్నదేమోనని సతీష్ అరోరా వెతికి చూడగా ఒక్క పండూ కనిపించలేదు. దీంతో ఆయన ఒక్క క్షణం అవాక్కయ్యారు. ఇంతలోనే.. ‘మేడమ్ బ్రేక్ ఫాస్ట్కి అంతా సిద్ధమేనా?’ అంటూ ప్రధాని వ్యక్తిగత బృందం నుంచి మెసేజ్. ఇప్పుడేం చేయాలిరా భగవంతుడా అనుకుంటూ.. ఇద్దరు తోటి చెఫ్లను వెంటబెట్టుకుని పోలీస్ జీపు ఎక్కి గోవా మార్కెట్ మీద పడ్డారు. గోవాలో, అదీ నవంబరు మాసం కావటంతో పక్వానికి వచ్చిన బొప్పాయి పండ్లు వారి కంటబడలేదు. ఓ 20 నిమిషాలకి.. వెతగ్గా వెతగ్గా ఒక్క డజను దోరగా పండిన బొప్పాయి పండ్లు కనిపించటంతో బతుకు జీవుడా అనుకుంటూ వాటిని తీసుకుని జీపులో హోటల్కి చేరుకున్నారు.
అయితే.. వీరి ఆనందం అరక్షణంలోనే ఆవిరై పోయంది. బొప్పాయి పండ్లు తీసుకుని లోపలికి పోవటానికి ప్రధాని భద్రతా సిబ్బంది నిరాకరించారు. అసలు సంగతి చెప్పి బతిమాలుకున్నా.. వాళ్లు ఒప్పుకోలేదు. అంతేగాక.. తనిఖీల పేరుతో తెచ్చిన పండ్లన్నింటికీ రంధ్రాలు చేసి.. పక్కన పారేశారు. ఉసూరుమంటూ లోపలికి వెళ్లి.. ఆ రోజుకు వేరే వంటకాలతోనే ఆమె బ్రేక్ ఫాస్ట్ ఏర్పాట్లు పూర్తిచేశారు. మర్నాటికి.. ముంబై తాజ్ హోటల్ నుంచి మంచి బొప్పాయి పండ్లు తెప్పించారు.
ఏదో రకంగా నాటి ప్రధాని ఇందిరా గాంధీకి బ్రేక్ఫాస్ట్గా గుప్పెడు బొప్పాయిల అందిచేందుకు తాము చేసిన ప్రయత్నం విజయవంతం కాకపోగా.. అది తమకు అత్యంత నిరాశనే మిగిల్చిందని తన అరోరా. పైగా జీవితంలో మర్చిపోలేనంత టెన్షన్కి గురిచేసిన రసవత్తరం ఘట్టం అని తన పుస్తకం ‘స్వీట్స్ అండ్ బిట్టర్స్: టేల్స్ ఫ్రమ్ ఏ చెఫ్స్ లైఫ్’ లో చెఫ్ సతీష్ అరోరా వివరించారు.