Petrol-Diesel Price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను సవరించి చాలా కాలమైంది. దాదాపు రెండేళ్లు గడిచిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాక పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని భావించారు కానీ.. ఇంతవరకూ అలాంటి సమాచారం ఏదీ లేదు. 2024లో లోక్ సభ ఎన్నికలు ఉండటంతో.. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్న ఊహాగానాలు మొదలయ్యాయి. లీటర్ పెట్రోల్ పై ఏకంగా రూ.10 మేర తగ్గించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.
2024 ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే అన్ని చర్చలు ముగిసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సంతకం ఒక్కటే మిగిలి ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సంతకాలు పెట్టి.. ఆదేశాలు అమల్లోకి వచ్చిన తర్వాత.. లీటర్ పెట్రోల్ పై రూ.10, లీటర్ డీజిల్ పై రూ.10 తగ్గుతుందని తెలిపాయి.
మూడు త్రైమాసికాలుగా చమురు సంస్థలు లాభాల్లో ఉండటంతో.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఐఓసీ, హెచ్ పీసీఎల్, బీపీఎస్ లాభాలు.. గత త్రైమాసికంలో సుమారు రూ.28 వేల కోట్లు దాటేశాయి. నిత్యవసర వస్తువుల ధరలు, కూరగాయల రేట్లు పెరిగిన ఈ సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే.. సామాన్యుడికి నిజంగా కాస్త ఊరట లభిస్తుంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.