TSRTC: తెలంగాణలో 80 కొత్త ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి పచ్చజెండా ఊపి బస్సులను ప్రారంభించారు. తొలుత బస్సుల వద్ద పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సుల్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కొత్త బస్సులతో ప్రయాణికుల ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయని తెలిపారు. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సమయంలో కొత్త బస్సులను ప్రారంభించడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్ వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా.. కొత్త బస్సులను తీసుకొచ్చారు. అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సు లు నేటి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ నాన్ ఏసీ బస్సులున్నాయి. ఈ ఆర్థిక ఏడాదికి గాను 400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సు లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. వీటికి తోడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సు లను TSRTC అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ బస్సులన్నీ విడతల వారీగా మార్చి 2024 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా TSRTC ప్లాన్ చేసింది.
.
.