మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. తాజాగా వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్పై పులివెందుల కోర్టులో స్థానిక పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.
వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పమంటూ సీబీఐ ఎస్పీ, వివేకా కుమార్తె, అల్లుడు తనను ఒత్తిడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు వివేకా పీఏ కృష్ణారెడ్డి. 2021 నవంబర్లో పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. 2021 డిసెంబరు 28న పులివెందుల కోర్టును కృష్ణారెడ్డి ఆశ్రయించారు. ఈ ఏడాది డిసెంబర్ 8న కోర్టు పిటిషన్ను పరిశీలించి కేసు రిజిస్టర్ చేసి జనవరి 4న తుది నివేదిక దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసుపై దర్యాప్తు చేసిన మొదటి, రెండో సిట్ బృందాల వద్ద ఉన్న వివరాలు, క్లూస్ బృందం వద్ద ఉన్న ఆధారాలతోపాటు.. సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలను ఛార్జిషీట్లో పొందుపరుస్తూ పులివెందుల అర్బన్ సీఐ కోర్టుకు సమర్పించారు. 27 మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా కోర్టుకు అందించారు.