వైసీపీలో టికెట్ల మార్పుతో మంత్రులకు కూడా స్థానచలనం తప్పట్లేదా..? ఉమ్మడి అనంతపురం జిల్లాను వైసీపీ ప్రయోగాలకు వేదికగా మార్చుకుంటుందా..? ఇక్కడ ఎన్ని టికెట్లు మార్చుతున్నారు..? మంత్రి ఉష శ్రీ చరణ్ పరిస్థితి ఏంటీ..? ఆమె టికెట్ మార్చితే.. అక్కడి ఎమ్మెల్యే పరిస్థితి ఏంటీ..? అసలు ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది..?
ఉమ్మడి అనంతపురం జిల్లా పూర్తిగా టీడీపీకి పట్టున్న ప్రాంతం.. జిల్లాలో అధిక సంఖ్యలో బీసీలు ఉన్న ప్రాంతం కూడా.. దీంతో సహజంగానే టిడిపికి ఇక్కడ పట్టు ఎక్కువ. 2004 ఎన్నికలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేవ్ ఉన్నా కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో టిడిపి ఆరు స్థానాలు గెలుచుకుంది. టీడీపీకి అంత పట్టున్న ప్రాంతం అది. 2014లో టీడీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి. అప్పట్లో 12 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. కానీ 2019లో ఆ సీన్ రివర్స్ అయింది. 12 స్థానాలకు రెండు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఆ ప్రాంతం వైసీపీ చేతిలోకి వెళ్లిపోయిందని ఆ పార్టీ కాన్ఫిడెంట్గా ఉంది.
అయితే, ఇప్పుడు 2024 ఎన్నికల కోసం పార్టీ నుండి అభ్యర్థులు సిద్దమవుతున్న తరుణంలో వైసీపీ టికెట్ల మార్పు అంశం తెరమీదకు వచ్చింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు మొదలయ్యింది. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆరు స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది వైసీపీ అధిష్టానం. అందులో ప్రస్తుతం కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఉష శ్రీ చరణ్ని పెనుకొండకు మార్పు చేశారు. ఈ విషయం ఇటీవల ప్రెస్ మీట్లో స్వయంగా మంత్రి ఉష వెల్లడించారు. దీంతో పెనుకొండ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి శంకర నారాయణ భవితవ్యం ఎంటా అన్నది ప్రశ్నగా మారింది.
అయితే, కళ్యాణదుర్గం సీటు నుంచి మంత్రి ఉష శ్రీ చరణ్ను ఎందుకు తప్పించారు? ఎందుకు మార్చారు..? అనే అంశంలో పూర్తి క్లారిటీ లేదు. కానీ, ఉష శ్రీ చరణ్ మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే చోట 170 ఎకరాలు పైన సొంత నేతల భూములే ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె అనుచరులు కూడ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూకబ్జాలు చేస్తున్నారనే విమర్శ ఉంది. అందులో, మంత్రి కీలక అనుచరుడైన ఓ జెడ్పీటీసీ.. ఒకే ఊరిలో 67 ఎకరాలు.. బెదిరించి తన భార్య పేరిట రాయించుకున్నాడని ఒక వీడియో కూడా ఆమధ్య హల్చల్ చేసింది.
ఇదంతా మంత్రి పలుకుబడితోనే జరుగుతోందనీ.. కబ్జాలకు బెదిరింపులకు పాల్పడుతున్నారని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. అలాగే, సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టించారని కొందరు మంత్రికి ఎదురుతిరిగినట్లు తెలుస్తోంది. దీనిపై స్థానిక నేతలు బహిరంగంగానే సమావేశాలు పెట్టి, ఈసారి ఆమెకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని వైసీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారట. ఇక సొంత పార్టీ ఎంపీ తలారి రంగయ్య నుంచి కూడ విబేధాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. కాగా, ఆమెను ఆ స్థానం నుంచి తప్పించాలని అధిష్టానానికి కంప్లైంట్ కూడ చేశారని సమాచారం. దీంతో చేసేది లేక అధిష్టానం కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీని తప్పించిందా అనే టాక్ నడుస్తోంది.
ఇలాంటి పరిణామాల మధ్య సొంత సామాజిక వర్గం నేతలతో కూడా ఆమెకు పోసగడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల, జిల్లాలో అట్టహాసంగా జరిగిన కురువ సంఘం గుడికట్ల సంబరాల్లో కూడా ఆమె కలుగజేసుకొని, జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడుగా ఉన్న రాజహంస శ్రీనివాసులుని మార్చారనీ.. తనకు అనుకూలంగా ఉన్న ఈశ్వరయ్యను తీసుకొచ్చి పెట్టారనే విమర్శ ఉంది. ఇది కూడా కురుమ సంఘం నాయకులకు నచ్చ లేదని సమాచారం. ఆమెకు మంత్రి పదవి వచ్చింది కూడా సామాజిక వర్గం కేటగిరీలోనే.. అలాంటిది, చివరకు తన సామాజిక వర్గంలో కూడా ఐక్యత సాధించడంలో ఉష శ్రీ చరణ్ విఫలమైందన్న ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి.
ఇవన్నీ కలిసి టికెట్ మార్పుకు దోహదం చేశాయని సొంత పార్టీ నాయకులు, అలాగే సొంత సామాజిక వర్గ నాయకులు మాట్లాడుకుంటున్నారు. కాగా, ఉమ్మడి అనంత జిల్లాలో ఒక సీట్ మార్చడంతో ఇన్ని పరిమాణాలు జరిగితే.. ఇక దాదాపు 8 సీట్లు మార్పులు చేర్పులు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందా అని పార్టీ క్యాడర్ ఆలోచనలో పడింది. సీట్ల మార్పులో ఇంకెన్ని మలుపులు చోటు చేసుకుంటాయి అని జిల్లా ప్రజలు, కార్యకర్తలు మాట్లాడుకున్నారు.