ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు కదులుతున్నారు. కదన రంగంలో ఎవరి బలాలు ఎంతో చూపించుకోడానికి నానా తంటాలూ పడుతున్నారు. ప్రచారాలు, ప్రణాళికలతో పాపులారిటీ కోసం పాకులాడుతున్నారు. అయితే, ఒక్క పార్టీ మాత్రం స్థబ్ధుగా కాలం వెళ్లదీస్తోంది. టగ్ ఆఫ్ వార్ అనుకుంటున్న ఎన్నికల్లో తమ పాత్రగా ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయినట్లు తెలుస్తుంది..? ఎన్నికలకు రెండు మూడు నెలల సమయమే ఉన్నా ఎటు తేల్చుకోలేక మదన పడుతుంది. ఏంటా పార్టీ…? ఎందుకా మదనం..?
గత ఏపీ ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో వైసీపీ ఒంటరిగా పోటీ చేసి, 175 సీట్లకు 151 సీట్లతో విజయ బావుటా ఎగరేసింది. టీడీపీ ఒంటరి పోరుతో ఎన్నికలకు వెళ్లి 23 సీట్లకే పరిమితమైంది. ఇక జనసేన పార్టీ సీపీఐ, సీపీఐ(ఎం), బీఎస్పీతో జతకట్టి ఎన్నికలలో ఒక్క సీటును సంపాదించి, ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. బీజేపీ సైతం ఒంటరి పోరు చేసి, గతంలో మాదిరిగానే ఓటమిపాలైంది. అయితే, రాబోయే ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికే ఖరారైన పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన ముందుకు దూకుతుంటే.. బీజేపీ పార్టీ మాత్రం నిమ్మకునీరెత్తినట్లే కనిపిస్తుందని అంతా అనుకుంటున్నారు. కేంద్రంలో జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ రాష్ట్రంలో జనసేనను అక్కున చేర్చుకోవాలో.. పక్కన పెట్టేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయింది. టీడీపీతో కలుస్తుందో లేదో అనేదీ అస్పష్టంగానే ఉంది. మీడియా సమావేశాల్లో కూడా పొత్తుల వ్యవహారంలో అస్పష్టంగానే మాట్లాడుతూ కాలం గడుపుతున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఇంతకీ, ఎన్నికల సందర్భంలో ఈ పార్టీ ఏపీలో ఏం చేస్తుందనే విషయం ఇప్పటి వరకూ ఎవ్వరీ అర్థం కానట్లే కనిపిస్తోంది.
ఇక, 2024 ఎన్నికలలో మరోసారి ఒంటరిగా పోటీ చేసి విజయభావుట ఎగరవేయాలని వైసీపీ తహతహలాడుతోంది. 175 నియోజకవర్గాల లక్ష్యంగా పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తుంది. తాము అందించిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆశలు పెట్టుకొని మరి చక చకా అడుగులు వేస్తుంది. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారుస్తూ కొంతమందికి సీట్లు ఇవ్వకుండా ప్రకటించేందుకు సిద్ధమైపోయింది. వాటితో పాటుగా మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తుంది. 2019లో తనను గెలిపించిన మేనిఫెస్టోను మరింత తీర్చిదిద్ది మరోసారి గెలుపే లక్ష్యంగా వైసీపీ పని చేస్తుంది. మరోవైపు, టీడీపీ 2019లో రిపీట్ అయిన రిజల్ట్ను మరోసారి రానివ్వకుండా గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని అడుగులు వేస్తుంది. ఒంటరి పోరుతో నష్టపోయామని ఈసారి పొత్తులతో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్ వేసింది. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్ని సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలని ఒక నిర్ణయానికి కూడా వచ్చింది. అలాగే, ఎన్నికలకు ప్రధానమైన మేనిఫెస్టోను కూడా సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మినీ మేనిఫెస్టోపై ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా కసరత్తు చేస్తోంది. ఓ పక్క మేనిఫెస్టో.. మరోపక్క అభ్యర్థుల ఖరారు పైన దృష్టి పెట్టి పనిచేస్తుంది. ఇంకోవైపు, జనసేన సైతం టీడీపీతో పొత్తులో భాగంగా ఏఏ సీట్లో పోటీ చేయాలి.. ఉమ్మడి మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలను పొందుపరచాలి.. తన ఓటు బ్యాంకును పొత్తులో ఉన్న పార్టీలకు తప్ప ఇతర పార్టీలకు డైవర్ట్ అవ్వకుండా ఎలాంటి వూహాలు రచించాలనే పనిలో నిమగ్నమైపోయింది. ఈ ఎన్నికల్లో టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కృతనిశ్చయంతో పనిచేస్తుంది.
ఇలా అన్ని పార్టీలు ఎన్నికల గెలుపే లక్ష్యంగా వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పన్నుతూ దూసుకుపోతున్నాయి. అయితే, బీజేపీ పార్టీ మాత్రం అసలు తమకు ఎన్నికలే లేనట్టు, ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు వ్యవహరిస్తుంది. టీడీపీతో జనసేన పొత్తు ఖరారవ్వక ముందు 2024 ఎన్నికలకు జనసేనతో కలిసి పోటీ చేయాలని బిజెపి భావించినప్పటికీ జనసేనాని నిర్ణయంతో ఆ ఆలోచనలు, ఆశలన్నీ పూర్తిగా ఆవిరైపోయాయి. ఇప్పటికీ జనసేన మాతో పొత్తులోనే ఉందని బిజెపి చెప్పుకుంటూ వస్తుంది. జనసేన కూడా బిజెపితో అల్రెడీ పొత్తులోనే ఉన్నాంగా అని చెబుతోంది. కానీ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ రెండు పార్టీల పొత్తు అధికారికంగా వెల్లడి కాలేదు. ఏపీ బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టంగానే ఉన్నప్పటికీ టిడిపి ఉండటం వల్ల, జనసేనతో కలవడానికి ఇష్టపడడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక బీజేపీ పార్టీలో కొందరు నేతలు టీడీపీ, జనసేన పొత్తులో తామూ కలవడానికి ఓకే అంటుంటే.. మరి కొందరు నేతలు వద్దని వారిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో బీజేసీ దారెటూ అనేది అస్పష్టంగానే ఉంది. ఈసారి ఎన్నికల్లో బిజెపి, టిడిపి, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేస్తుందా లేదా ఒంటరిగా పోటీ చేస్తుందా అనే అయోమయంలో బిజెపి కార్యకర్తలు ఉన్నారు. ఇక, మరో వంద రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే నేపథ్యంలో జనవరిలో అయినా ఏపీ బిజెపి ఎన్నికల వ్యూహంలో ఒక స్పష్టత వస్తుందేమో వేచి చూడాలి.