TDP Jai Ho BC Programme : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తోంది. గత ఎన్నికల సమయంలో పార్టీకి దూరమైన వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. బీసీలను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం వివరాలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి అని నారా లోకేశ్ విమర్శించారు. వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. అందుకే ఆయావర్గాల్లో చైతన్యం తీసుకొస్తామని స్పష్టం చేశారు. జనవరి 4 నుంచి జయహో బీసీ కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించింది. ఈ కార్యక్రమం 2 నెలలపాటు కొనసాగుతుందని వివరించారు.
ఈ కార్యక్రమం తొలి విడతలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో జరుగుతుందని లోకేశ్ తెలిపారు. క్షేత్రస్థాయి టీడీపీ నేతలు పర్యటిస్తారన్నారు. బీసీల కష్టాలు తెలుసుకుంటారని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేస్తామని నారా లోకేశ్ ప్రకటించారు.
బీసీలు బలహీనవర్గం కాదు..బలమైన వర్గమని నారా లోకేశ్ అన్నారు. వారి కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు. బీసీలకు పర్మినెంట్ కుల ధృవీకరణ పత్రం ఇస్తామని హామీ ఇచ్చారు. ఉపకులాలవారీగా నిధుల కేటాయిస్తామని ప్రకటించారు. టీడీపీ హయాంలో బీసీ సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టామన్నారు. ఎక్కువ సీట్లు బీసీలకే కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. ఓడిపోయే సీట్లు బీసీలకు వైసీపీ కేటాయిస్తుందని విమర్శించారు. మంగళగిరిలో వైసీపీకి ఓటమి ఖాయమన్నారు. కడప, పులివెందుల సీట్లు బీసీలకు ఎందుకివ్వరు? లోకేశ్ ప్రశ్నించారు.