డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు సీఎం జగన్ అంటే ఎంత ఇష్టమో.. తనకు కూడా ఆయనంటే అంతే ఇష్టమని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేర్కొన్నారు. ఏపీలో అంగన్ వాడీలు తమ డిమాండ్లను నెరవేర్చాలని నిరసన బాట పట్టిన విషయం తెలిసిందే. గురువారం నెల్లూరులో అంగన్ వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరసనకు సంఘీభావంగా.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నిరసన శిబిరంలో పాల్గొన్నారు. నిరసనలో మరణించిన సంగం మండలం తరుణవాయి గ్రామానికి చెందిన రమణమ్మ కుటుంబానికి రూ.70 వేలు ఆర్థిక సహాయం ప్రకటించారు.
ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతానన్న జగన్ మాట తప్పడం తగదన్నారు. ప్రసవం తర్వాత తన భార్య ఇద్దరు పిల్లలతో ఎంత ఇబ్బంది పడిందో తనకు తెలుసని.. ఎంతోమంది బిడ్డలను చూస్తున్న అంగన్ వాడీల పట్ల నిర్దయగా వ్యవహరించడం తగదన్నారు. ఎందరో బిడ్డల్ని ఓర్పుతో ఆదరిస్తోన్న అంగన్ వాడీ తల్లుల న్యాయమైన కోరికల్ని తీర్చాలని జానీ మాస్టర్ డిమాండ్ చేశారు.