సౌతాఫ్రికా గడ్డమీద తొలిటెస్ట్ లో భారత్ ఇన్నింగ్స్ ఓటమిపై క్రికెట్ అభిమానులు నెట్టింట తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు. వాతావరణానికి తట్టుకోలేకే ఓటమి పాలయ్యారని కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఒకవైపు వర్షం ఛాయలు, చలిగాలుల మధ్య తీవ్ర ఇబ్బందులు పడి వికెట్లు పారేసుకున్నారని కొందరు మాట్లాడుతున్నారు. కానీ నెట్టింట మాత్రం ట్రోలింగులు ఆగడం లేదు. ఈ దశలో టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు చేశాడు. ఇదే ఓటమికి ప్రధాన కారణమని అన్నాడు.
రెండోరోజు లంచ్ బ్రేక్ తర్వాత సౌతాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 49 పరుగులతో ఉంది. తర్వాత సెషన్ ప్రారంభంలో బౌలర్లను మార్చడంపై దుయ్యబట్టాడు. మెయిన్ స్ట్రీమ్ బౌలర్లు బుమ్రా, సిరాజ్ ఉండగా వారిని కాదని ప్రసిద్ధ్ క్రష్ణ, శార్దూల్ ఠాకూర్ తో వేయించడం సరికాదని అన్నాడు. అది వ్యూహాత్మక తప్పిదమని అన్నాడు. ఏ కెప్టెన్ అయినా తను చెప్పినట్టే చేస్తాడని అన్నాడు. మరి ఈ నిర్ణయాన్ని రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ కలిసి తీసుకున్నారా? అనే అనుమానాన్ని వ్యక్తం చేశాడు. అదే జరిగితే ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని అన్నాడు. నేను కోచ్ గా ఉన్నప్పుడు ఇలాగే చేసేవాడినని సంప్రదాయ ఆటకు భిన్నంగా రోహిత్ నడుచుకున్నాడని దుయ్యబట్టాడు. భారత్ చేసిన అతి పెద్ద పొరపాటు ఇదేనని తేల్చి చెప్పాడు.
అప్పటికి ఫాస్ట్ బౌలర్లకి పిచ్ సహకరిస్తున్నప్పుడు బూమ్రాకి వికెట్లు పడుతున్నప్పుడు ఇలా చేయడం సరికాదని అన్నాడు. ఈ విషయంపై సంజయ్ మంజ్రేకర్ కూడా మాట కలిపాడు. రవిశాస్త్రి చెప్పిన మాట సబబైనదేనని అన్నాడు. అయితే సౌతాఫ్రికా మాజీ పేసర్ వెర్నాన్ ఫిలాండర్ వీరికి భిన్నంగా స్పందించాడు. బూమ్రాకు విశ్రాంతిని ఇవ్వాలనే భావనతోనే రోహిత్ శర్మ అలా చేయించి ఉండవచ్చునని అన్నాడు. అంత పెద్ద ఆటగాడికి, ఏ బౌలర్ తో బౌలింగ్ చేయించాలో తెలీదని అనుకోవడం సరికాదని అన్నాడు.
మొత్తానికి బౌలర్స్ ఎలా ఆడితే ఏముంది? ముందు బ్యాటర్లు సరిగ్గా మనసు పెట్టి ఆడాలి కదా అంటున్నారు. బ్యాటింగ్ పిచ్ లపై అరవీర భయంకరంగా ఆడటం కాదు, బౌలింగ్ పిచ్ ల మీద కూడా ఆడగలగాలి. బౌలింగ్ పిచ్ వచ్చినప్పుడు ఆడలేకపోతే, ఇక అంతర్జాతీయ ఆటగాళ్లు అనే మాటకి అర్థమే లేదని కొందరు వ్యాక్యానిస్తున్నారు. వన్డే, టీ 20 లు ఎడతెరిపి లేకుండా ఆడటమే, ఈరోజు ఇలా టీమ్ ఇండియా బ్యాటర్లు తయారు కావడానికి కారణమని కామెంట్లు చేస్తున్నారు.