Chandrababu Kuppam Tour: ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలనే ధ్యేయంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వరుస పర్యటనలు చేస్తూ క్యాడర్ ని సమాయత్తం చేసే పనిలో పడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మూడురోజుల పాటు చంద్రబాబు పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం నాడు నియోజకవర్గంలోని గుడుపల్లెలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో స్థానికులు, టీడీపీ, జనసేన కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొని ఘనస్వాగతం పలికారు.
కాగా నేడు పర్యటనలో భాగంగా చంద్రబాబు.. ఉదయం 11.50 గంటలకు శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. అలానే మధ్యాహ్నం 3 గంటలకు రామకుప్పం పోలీస్ స్టేషన్ సెంటర్లో బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ఇక సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు కుప్పంలోని ఎంఎం ఫంక్షన్ హాలులో జనసేన నేతలు, కార్యకర్తలతో సమీక్ష చేయనున్నారు. అనంతరం 6 గంటల 15 నిమిషాలకు బీసీఎన్ కన్వెన్షన్ హాలులో టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక చివరగా రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో బస చేయనున్నారు.
అయితే గుడుపల్లె సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ సర్కారుపై ఫైర్ అయ్యారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. ఈ ముఖ్యమంత్రినే అంటూ ధ్వజమెత్తారు. వైసీపీ సినిమా అయిపోయిందని..ఆ పార్టీకి ఇక ఉన్నది వంద రోజులేనన్నారు. అరాచకాలు అన్నీ గుర్తున్నాయని.. వాటికి వడ్డీతో చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. ఈ ప్రభుత్వంలో అంగన్ వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు రోడ్డెక్కారని.. అధికారంలోకి రాగానే ఇలాంటి చిరుద్యోగులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.