Rahul Gandhi Bharat Nyay Yatra | భారత్ న్యాయ్ యాత్ర.. లోక్ సభ ఎన్నికలపైనే కాంగ్రెస్ ఫోకస్!
Rahul Gandhi Bharat Nyay Yatra | కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ మరోసారి జోడో యాత్ర చేయబోతున్నారు. భారత్ న్యాయయాత్ర పేరుతో ఈ యాత్ర సాగనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ యాత్ర సాగనుంది. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు ఈ యాత్ర ఉంటుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. భారత్ న్యాయయాత్రలో బస్సు యాత్రతో పాటు పాదయాత్ర కూడా ఉంటుంది. భారత్ న్యాయయాత్ర మొత్తం 6,200 కిలోమీటర్లు ఈ యాత్ర ఉంటుందని.. 14 రాష్ట్రాల మీదుగా 84 జిల్లాల్లో సాగుతుందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. యువతతో పాటు అన్ని వర్గాలను ఈ యాత్రలో రాహుల్ గాంధీ కలుస్తారని తెలిపారు.
జనవరి 14 2024న, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మణిపూర్లో పార్టీ జెండా ఊపి భారత్ న్యాయ్ యాత్రను ఆరంభిస్తారు. ఈ యాత్ర మార్చి 20న ముంబైలో పూర్తవుతుంది. దేశంలోని 14 రాష్ట్రాలు మణిపూర్, నాగాల్యాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలలో భారత్ న్యాయ యాత్ర కొనసాగుతుంది.
రాహుల్ గాంధీ దేశంలోని తూర్పు రాష్ట్రాల నుంచి పశ్చిమ రాష్ట్రాల వరకు భారత్ జోడో లాంటి యాత్ర చేయాలని.. డిసెంబర్ 21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తెలిపింది. దీని వల్ల లోక్ సభ ఎన్నికల దృష్ట్యా పార్టీ ఇమేజ్ పెరుగుతుందని కమిటీ అభిప్రాయం. ముఖ్యంగా మహిళలు, యువత లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.
ఏమిటీ భారత్ న్యాయ్ యాత్ర?
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలో దేశంలో ప్రజల మధ్య పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, మత విద్వేషాలు, కేంద్ర ప్రభుత్వ నియంత పరిపాలన లాంటి అంశాలపై ప్రశ్నించారు. ఇప్పుడు భారత్ న్యాయ్ యాత్రలో సామాజిక న్యాయం, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా ప్రజలకు జరిగే అన్యాయంపై ఆయన మోదీ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశముంది. జోడో యాత్ర సమయంలో ప్రజలు ఐక్యమత్యంగా ఉండాలని, మత సామరస్యం చూపాలని, దేశంలో ప్రజల మధ్య విభజన జరగకూడదని రాహుల్ గాంధీ దేశ ప్రజలకు సందేశామిచ్చారు.
2024 లోక్ సభ ఎన్నికల ముందు భారత్ న్యాయ్ యాత్ర ఎందుకు?
లోక్ సభ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందే కాంగ్రెస్ భారత్ న్యాయ్ యాత్ర చేపట్టడం వెనుక పార్టీ ఉద్దేశం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ యాత్ర బెంగాల్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాల మీదుగా కొనసాగుతుంది. ఈ రాష్ట్రాలలో లోక్ సభ సీట్లు అత్యధికంగా ఉన్నాయి. యాత్ర కొనసాగే రాష్ట్రాలలో మొత్తం 355 ఎంపీ సీట్లున్నాయి. ఈ రాష్ట్రాలలోని ఓటర్లను ప్రభావితం చేయడం కాంగ్రెస్కు చాలా ముఖ్యం. I N D I A కూటమిలో ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రాలలోనే సీట్ల సర్దుబాటు చేసుకోవడం అంత సులువు కాదు. న్యాయ యాత్రలో కూటమి పార్టీల నేతలు ఆయా రాష్ట్రాలలో రాహుల్ గాంధీని ఎలా స్వాగతించబోతున్నారో చూడాలి. ఎందుకంటే ఈ యాత్ర సమయంలోనే I N D I A కూటమిలోని పార్టీ నేతలు కూడా ఎన్నికల ప్రచారం కోసం ర్యాలీలు, యాత్రలు నిర్వహించబోతున్నారు.
భారత్ న్యాయ్ యాత్ర పట్ల I N D I A కూటమి..
భారత్ న్యాయ్ యాత్ర రాహుల్ గాంధీ ప్రారంభిస్తారు. యాత్రలో కాంగ్రెస్ తరపున ఆయనే కీలక నేత. కానీ ఇటీవల ఢిల్లీలో జరిగిన I N D I A కూటమి సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షడు అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరుని ప్రస్తావించారు. కానీ ఈ విషయంలో ఖర్గే మాట్లాడుతూ.. ఇప్పుడే ప్రధాన మంత్రి అభ్యర్థి పేరును ప్రస్తావించడం అనవసరం.. ఎన్నికల్లో గెలుపుపైనే అందరూ దృష్టి సారించాలని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరపున కానీ, లేదా మరే పార్టీ కానీ రాహుల్ గాంధీ పేరుని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రస్తావించలేదు. ఈ యాత్ర తరువాత జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మార్పు చెందే అవకాశం ఉంది.
భారత్ జోడో యాత్ర
రాహుల్ గాంధీ 2022 సెప్టెంబర్ నెలలో భారత్ జోడో యాత్ర ప్రారంభించి.. 2023 జనవరిలో ముగించారు. ఈ యాత్రను ఆయన కన్యాకుమారిలో ప్రారంభించి 4500 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి కశ్మీర్లో పూర్తిచేశారు.
భారతదేశంలో ఐకమత్యం పెంపొందించడం కోసమే ఈ యాత్ర చేపట్టినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ఈ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.
భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ దేశంలోని 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 75 జిల్లాలలో కొనసాగించారు. చాలామంది రాజకీయ ప్రముఖులు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర తరహాలోనే తూర్పు నుంచి పశ్చిమ భారత్ ప్రాంతాలు కవర్ అయ్యేలా రాహుల్ గాంధీ యాత్ర చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే తాజాగా భారత్ న్యాయ యాత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Rahul Gandhi Bharat Nyay Yatra, turning point, Congress, Lok Sabha elections, Rahul Gandhi, Bharat Nyay Yatra, INDIA Alliance, poll campaign, seat sharing, Kejriwal, Mamata Banerji,