Rachakonda : హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, వారి బృందం బుధవారం ఓ వెరైటీ దొంగను అరెస్టు చేశారు. వెరైటీ దొంగ శంకర్ నాయక్ డైరీ ఇప్పుడు ఓ సంచలనంగా మారింది. దాదాపు 11 ఏళ్ల వ్యవధిలో 102 చోరీలు చేశాడని పోలీసులు తెలిపారు. 10 కోట్ల రూపాయలు కొట్టేసి ఉంటాడని హైదరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ దొంగతనాలకు సంబంధించిన పూర్తి వివరాలను దాదాపు 10 డైరీలలో భద్రంగా రాసాడని పోలీస్లు గుర్తించారు. ఈ చోరీ సొత్తుతో శంకర్ నాయక్ ప్రతి రోజు కనీసం 10 వేలు విలువ చేసే డ్రెస్, షూస్, చెప్పులు, వాచిలు ధరించేవాడని పోలీసు దర్యాప్తులో తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా తూముకుంట గ్రామం నాగర్లబండ తండాకు చెందిన రత్లావత్ శంకర్నాయక్(28) ‘గే’ రేట్- బీ ఫార్మసీ పూర్తి చేశాడు. హత్యాయత్నం కేసులో గద్వాల్ పోలీసులు శంకర్ నాయక్ను అరెస్ట్చేసి జైలుకు పంపారు. జైల్లో చోరీ కేసులో అరెస్టయిన ఓ యువకుడు తనకు పరిచయమయ్యాడు. అతనితో కలిసి జైలు నుంచి విడుదలయ్యాక గంజాయి, మద్యం వంటి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. దురలవాట్లకు అవసరమైన డబ్బు కోసం చోరీల బాటపట్టాడు. చోరీ చేయడం, తాకట్టు పెట్టడం మొదలుపెట్టాడు. వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని ప్రారంభించాడు.
శంకర్ నాయక్ సోను అనే పేరుతో వివిధ యాప్లలో ” నాకు అందమైన మగ వారు కావాలి అంటూ ఆకర్షిస్తాడు. దాని కోసం 5 స్టార్, 7 స్టార్ హోటల్స్లోనే బస చేస్తుండేవాడు. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ఇంకా తదితర పట్టణ ప్రాంతాలలోని హోటల్స్లోనే ఉంటాడని పోలీసుల విచరణలో వెలుగులోకి వచ్చింది. ఈ ఆనందం కోసం శంకర్ నాయక్ ఇప్పటి వరకు 10 కోట్లు కర్చుపెట్టాడని శంకర్ నాయక్ డైరీలోని లెక్కల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు.
గతంలో ఇతడు ఒక ఇంట్లో చోరీ చేశాడు. అతడు కొట్టేసిన నగలు 10 తులాలైతే.. ఆ ఇంటి వారు 20 తులాలు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు శంకర్ పట్టుబడినపుడు తాను నిజం చెప్పినా ఎవరూ నమ్మకపోవటంతో రూటు మార్చాడు. అప్పటి నుంచి ఎక్కడ దొంగతనం చేసినా ఆ ఇంట్లో కొట్టేసిన వివరాలను చీటీ రాసి అక్కడ ఉంచేవాడు. అదే వివరాలను తన డైరీలో రాసుకునేవాడు. ఒకవేళ పోలీసులకు పట్టుబడితే తన వద్ద ఉన్న డైరీ చూసి నమ్మించే ప్రయత్నం చేసేవాడు.
సెప్టెంబరులో ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ వీధి నెంబర్ 5లో నివాసముండే లగిశెట్టి రాజు ఇంట్లో 19.1తలాల బంగారం, యూఎస్ డాలర్లు, కొంత నగదు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తూర్పుమండలం డీసీపీ సునీల్దత్ పర్యవేక్షణలో ఓయూ పోలీసులు సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ సేకరించారు.
అమీర్పేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న శంకర్నాయక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.13.50 లక్షల విలువైన ఆభరణాలు, ద్విచక్రవాహనం, మూడు చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. కొల్లాపూర్, విజయవాడ, ఎస్సార్నగర్లోని ప్రయివేటు ఫైనాన్స్ సంస్థలు, ప్రముఖ బంగారు దుకాణాల్లో తాకట్టు పెట్టినట్టు నిందితుడి దగ్గర రశీదులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా అక్కడ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలిపారు. కరడుగట్టిన దొంగను చాకచక్యంగా పట్టుకున్న ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు కృష్ణ, ప్రభాకర్, నరేశ్, రమాకాంత్లను డీసీపీ సునీల్దత్ అభినందించారు.