Pawan Kalyan : ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కోసం వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ నియోజకవర్గాల ఇన్ ఛార్జుల మార్పుతో ఆ పార్టీలో గుబులు రేపారు. అభ్యర్థుల ఎంపికపై జగన్ కసరత్తు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు తన అస్త్రసస్త్రాలు రెడీ చేస్తున్నారు. ఇంకోవైపు జనసేన అధ్యక్షుడు పార్టీపై ఫోకస్ పెట్టారు. నేతల సమావేశమవుతూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఇన్చార్జిలతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అవసరమైతే త్యాగాలకు సిద్ధపడాలని సూచించారు. పొత్తుల్లో భాగంగా ఎంచుకునే సీట్లు, వదులుకునే సీట్లు పై చర్చిస్తున్నారు. వైసీపీ విమర్శలను తిప్పి కొట్టడంపై కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. స్థానిక టీడీపీ నేతలను కలుపుకుంటూ నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళిక రచిస్తున్నారు.
గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ముందుగా ఉభయ గోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితి, అభ్యర్థుల సత్తాపై దృష్టి పెట్టారాయన. మూడు రోజులు పవన్ కళ్యాణ్ కాకినాడలో మకాం వేయనున్నారు. పార్టీ ముఖ్యనాయకులతో అంతర్గత సమావేశంతో మొదలుపెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న నేతల బలాబలాల్ని బేరీజు వేసుకోనున్నారు. ఏయే నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది.. టీడీపీతో పొత్తులో భాగంగా ఏ సీట్లు కోరాలి అనే అంశాలపై జనసేన ముఖ్య నాయకుల అభిప్రాయాలు సేకరించనున్నారు.