Sringeri Temple : పావన తుంగా నదీ తీరంలో పచ్చని కొండకోనల నడుమ.. అణువణువునా వేదఘోష వినిపించే శృంగేరి అరుదైన దివ్యధామంగా విలసిల్లుతోంది. వేదకాలపు జీవనశైలికి, ఊహకు అందని ఆధ్యాత్మిక పరిమళాలకు అసలైన ప్రతీకగా నిలుస్తోన్న దివ్యక్షేత్రాల్లో శృంగేరి కర్ణాటకలోని చికమగళూరు జిల్లాలో ఉంది. పడమటి కనుమల్లోని పర్వత శ్రేణుల్లో, ప్రశాంత అటవీ ప్రాంతంలోని ఈ క్షేత్రం.. బెంగళూరు నుంచి 335 కి.మీ దూరాన, ఉడిపి నుంచి 85 కి.మీ దూరంలో శృంగేరి ఉంది.
పూర్వం బుుష్య శృంగుడనే మహారుషి ఇక్కడ దీర్ఘకాలం తపస్సు ఆచరించిన కారణంగా.. ఆ కొండకు బుష్యశృంగ గిరి అనే పేరు వచ్చింది. ఇదే.. కాలక్రమంలో ‘శృంగేరి’ అయింది. అనంతర కాలంలో దేశం నలుమూలలా నాలుగు పీఠాలను స్థాపించాలనే సంకల్పంతో.. జగద్గురువైన ఆది శంకరులు ఇక్కడి భద్రా నదీతీరానికి వచ్చారు. ఆ వర్షాకాలంలో అక్కడ ప్రసవ వేదన పడుతున్న ఓ కప్పకు.. ఒక పెద్ద నాగుపాము తన పడగను గొడుగుగా మార్చి.. ఆ కప్పను తడవనీయకుండా ఉండటం ఆదిశంకరులు గమనించారు. సహజసిద్ధమైన జాతివైరాన్ని మరచి.. జంతువులు సైతం మైత్రితో జీవించే ఈ స్థలమే శారదా పీఠానికి సరైనదని గుర్తి్ంచి.. అక్కడే 12 ఏళ్లపాటు ఉండిపోయి.. శారదామాత ఆలయాన్ని ప్రతిష్టించారు. అలాగే.. ఆలయానికి అనుబంధంగా వేదాధ్యయనం కోసం ఒక గురుకులాన్ని స్థాపించారు. ఈ పీఠంలోనే తొలిసారి ఆది శంకరులు తన శిష్యులకు అద్వైత బోధ చేశారు.
మరో కథ ప్రకారం.. శంకరులు తర్కశాస్త్ర చర్చలో పండితులను ఓడించే క్రమంలో మండన మిశ్రుడనే పండితుడితో తలపడతాడు. ఈ చర్చలో ఓడిన వ్యక్తి.. గెలిచిన వ్యక్తికి శిష్యడిగా మారాలనే షరతుతో వారిద్దరూ తలపడతారు. అయితే.. చర్చలో మండన మిశ్రుడు ఓడిపోయే పరిస్థితి రాగా.. ఈ సంగతి తెలుసుకున్న మండన మిశ్రుడి భార్య ‘భారతి’.. భర్తకు బదులుగా తాను చర్చలో పాల్గొనేలా శంకరుడిని ఒప్పిస్తుంది. ఈ క్రమంలోనే శంకరుడు బ్రహ్మచారి అనే విషయాన్ని ఆసరాగా తీసుకుని ‘దంపతుల మధ్య శృంగారానికి సంబంధించిన ప్రశ్న’ను వేస్తుంది. దీంతో.. భారతి వద్ద శంకరులు కొంత సమయం తీసుకుని, పరకాయప్రవేశంచేసి ఓ రాజుగారి శరీరంలో ప్రవేశించి రాణులతోకూడి భారతి ప్రశ్నకు సమాధానం తెలుసుకొని తిరిగి వచ్చి మండనమిశృని ఓడిస్తారు. అయితే.. భారతి, మండనమిశృడు సాక్షాత్తూ సరస్వతీ బ్రహ్మ అవతారాలనే జ్ఞానం కలిగి.. శృంగేరిలో నిర్మించిన పీఠాన్ని సరస్వతీ దేవి గుర్తుగా శారదా పీఠం అని పేరు పెట్టి.. దానిని మండన మిశ్రుడికే అప్పగించి, హిమాలయాలకి వెళ్లి కేదార్నాధ్లో పరమేశ్వరుడిలో ఐక్యమయ్యారు.
నాటి 12వ శృంగేరి పీఠాధిపతి విద్యాశంకరుల ప్రోత్సాహం, ఆశీస్సులతో తురుష్క రాజులపై యుద్ధంలో విజయం సాధించిన తర్వాత.. హరిహర రాయలు, బుక్కరాయలు విజయ నగర సామ్రాజ్య స్థాపనకు పూనుకుంటారు. ఆ సమయంలో ఆర్థిక సమస్యలు తలెత్తగా, విద్యాశంకరుల స్వామి.. ఆది శంకరులు రాసిన ‘కనకధారా స్తోత్రాన్ని’ పఠించటంతో ఆకాశం నుంచి బంగారు నాణేలు కురిశాయట. ఆ ధనంతో వారు విజయనగర సామ్రాజ్య స్థాపనను విజయవంతంగా పూర్తి చేశారని చెబుతారు. దీంతో నాటి పాలకులు క్రీ.శ 1338లో విద్యాశంకరుల జ్ఞాపకార్ధం.. ఒక శివాలయాన్ని నిర్మించారు.
శృంగేరిలోని శారదా మాత ఆలయాన్ని గురించి వర్ణించేందుకు మాటలు చాలవు. నాలుగు ద్వారాలు గల ఆలయంలోని గర్భగుడిలో శారదా మాత బంగారు రథంపై ఆశీనురాలై ఉంటుంది. ఒక విగ్రహంగా గాక.. సాక్షాత్తూ మనల్ని అనుగ్రహించటానికి వచ్చిన మానవ మూర్తిగా అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తుంది. ఆది శంకరులతో ప్రతిష్ఠించ బడిన చందన విగ్రహ స్థానంలో.. విజయనగర పాలనాకాలంలో విద్యాశంకర స్వామి.. ప్రస్తుతమున్న బంగారు మూలమూర్తిని ప్రతిష్ఠించారు. గర్భాలయం చుట్టూగల ప్రదక్షిణ మంటపం, మహామంటపం, చిన్న మందిరాలలో సప్తమాతృకలు, వినాయకుడు, భువనేశ్వరీదేవి కొలువై ఉంటారు. వేదపాఠశాల, గ్రంధాలయం, ఆదిశంకరుల మందిరం వుంటాయి.
శృంగేరిలో భక్తులు బస చేసేందుకు శారదాపీఠం వారి సత్రాలున్నాయి. అలాగే భోజన సౌకర్యం కూడా ఉంది. సత్రం వీధిలోనూ అనేక ఫలహార శాలలు ఉన్నాయి. శారదాంబ మందిరం మొదటి అంతస్థులోని గ్రంథాలయంలో 500 తాళపత్రగ్రంథాలున్నాయి. ఇక్కడి శంకరాచార్య ఆశ్రమం, పార్కు, తుంగానది అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.