అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అడుగుపెట్టడమే ధనాధన్ రికార్డులతో హోరెత్తించడమే కాదు, టీమ్ ఇండియాలో సచిన్, కొహ్లీ వారసుడిగా శుభ్ మన్ గిల్ కీర్తి గడించాడు. కానీ ఇంతలో ఏమైందో తెలీదు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో అతి తక్కువ స్కోరుకి అవుట్ అయిన గిల్ మళ్లీ ఇప్పటి వరకు కోలుకోలేదు. వచ్చిన అనతికాలంలోనే అన్ని ఫార్మాట్లలో చోటు సంపాదించుకున్న గిల్…ఇప్పుడు వరుసగా ఆడిన ఆరు మ్యాచ్ ల్లో కలిపి కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో నెట్టింట తీవ్రమైన ట్రోలింగ్ బారిన పడ్డాడు.
క్రికెటర్లందరకీ ఒక బ్యాడ్ పీరియడ్ ఉంటుంది. అంతటి విరాట్ కొహ్లీ కూడా మూడేళ్లు అతి గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో ఒక్క సెంచరీ చేయడానికి తనెన్ని తంటాలు పడ్డాడో అందరికీ తెలిసిందే. కెప్టెన్సీ వదులుకున్నాడు. ఫాం కోల్పోయాడు…, ఐపీఎల్ లో సిల్లీ అవుట్ లు, ఇలా ఒకటి కాదు, అన్నింటా వైఫల్యాలతో తీవ్ర మానసిక క్షోభ అనుభవించాడు.
ఇక అంతటి క్రికెట్ దేవుడిగా కీర్తనలు అందుకున్న సచిన్ టెండుల్కర్ కూడా ఫాం దొరక్క అల్లాడిపోయాడు. ప్రతీ క్రికెటర్ జీవితంలో ఫామ్ కోల్పోవడం అనేది ఒక చీకటి దశ. కాకపోతే గిల్ కి అది కెరీర్ మొదట్లోనే రావడం దురదృష్టకరమని చెప్పాలి.
ఎందుకంటే ఐపీఎల్ పుణ్యామాని అత్యంత ప్రతిభావంతులైన యువ క్రికెటర్లతో జట్లన్నీ కళకళలాడుతున్నాయి. ఇప్పుడు టీమ్ ఇండియా… టీ 20 జట్టులో తీవ్రమైన పోటీ ఉంది. అందరూ అద్భుతంగా ఆడుతున్నారు. ఇక వన్డే జట్టులో కూడా అదే పరిస్థితి ఉంది. కొత్తగా వచ్చిన సాయి సుదర్శన్ లాంటి యువకులు, అనుకోకుండా జట్టులోకి తిరిగి వచ్చిన సంజు శాంసన్ లాంటి వాళ్లు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు.
బయట అంతటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికి టీమ్ మేనేజ్మెంట్ శుభ్ మన్ గిల్ పై అత్యంత నమ్మకంతో వరుసగా అవకాశాలిస్తూ వస్తోంది. మరి ఈసారి సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా గిల్, రోహిత్ ఇద్దరూ సెంచరీలు చేస్తే అందరి నోళ్లూ మూతలు పడతాయని అంటున్నారు.
టీమిండియాలో తన స్థానం కాపాడుకోవాలంటే గిల్ పరుగులు చేయక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. గిల్ టెస్టు కెరీర్ను ఓపెనర్గా ఆరంభించాడు. కానీ పుజారాకు సెలక్టర్లు మొండిచేయి చూపించడంతో తను వన్డౌన్లో బ్యాటింగ్కు వస్తున్నాడు.
ఓపెనర్ గా యశస్వీ జైశ్వాల్ వెళుతున్నాడు. యశస్వికి కూడా సైలంట్ గా అన్ని అవకాశాలు ఎందుకిస్తున్నారో అర్థం కావడం లేదని కొందరంటున్నారు. అంతేకాదు అవసరాన్ని బట్టి అన్ని ఫార్మాట్లలో ఏదోరకంగా ఆడిస్తున్నారు. నెట్టింట మాత్రం తనేమైనా రికమండేషన్ క్యాండిట్టా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతని కోసం ఇషాన్ కిషన్ ని బలి చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కాకపోతే ఇషాన్ గైర్హాజరీలోనే తనకి అవకాశం వచ్చిందని మరొకరు అంటున్నారు.