టీమ్ ఇండియా ప్లేయర్లను పేపర్ పై చూస్తే అంతా పులుల్లా కనిపిస్తారు. వారి పక్కనున్న రికార్డులు కూడా అవే స్థాయిలో ప్రత్యర్థులను భయపెట్టేలా కనిపిస్తుంటాయి. అంతేకాదు వీరి వికెట్లను తీయడం ప్రతీ బౌలర్ కూడా ఎంతో స్పెషల్ గా భావిస్తాడు. ఎగిరి గంతేస్తాడు. నేను కొహ్లీ వికెట్ తీశాను, రోహిత్ వికెట్ తీశానని ఉప్పొంగిపోతాడు. దానిని ఎంతో గొప్ప గౌరవంగా ప్రతీ బౌలర్ భావిస్తారు. అందులో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ కూడా ఉన్నారు.
వన్డే వరల్డ్ కప్ 2023లో సెమీస్ ఓటమితో టీ 20, వన్డే జట్టులో స్థానం కోల్పోయిన రబాడా ఈసారి టెస్ట్ మ్యాచ్ లో విజృంభించాడు. క్రికెట్ సౌతాఫ్రికాకు సవాల్ విసిరాడు. తనని జట్టు నుంచి తప్పించడం ఎంత మాత్రం సరికాదని నిరూపించాడు. 5 వికెట్లు తీసి టీమ్ ఇండియాని కోలుకోని దెబ్బ కొట్టాడు.
అయితే టీమ్ ఇండియాలో అరవీర భయంకరులైన రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ లాంటి సీనియర్ల వికెట్లు తీయడానికి రబాడా పక్కా స్కెచ్ తో వచ్చాడు. ఇదేమాట తను కూడా చెప్పాడు. వీరిద్దరి బలహీనతలపై దృష్టి పెట్టి, పదే పదే అవే బాల్స్ వేయడంతో వారిద్దరూ అవుట్ అయ్యారని తెలిపాడు. దీంతో సౌతాఫ్రికా పని తేలికైపోయింది.
ఈ నేపథ్యంలో 5 వికెట్లు తీసిన రబాడ 500 వికెట్ల క్లబ్ లో చేరిపోయాడు. అంతేకాదు సౌతాఫ్రికా నుంచి టీమ్ ఇండియాపై 5 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా కూడా రికార్డ్ సృష్టించాడు. ఇలా అన్నిరకాలుగా తన ఉనికిని మళ్లీ ఘనంగా చాటుకున్నాడు.
19 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ లోకి రబాడా వచ్చేశాడు. రెండేళ్లలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. ఇప్పుడు తన వయసు 28 సంవత్సరాలు. కేవలం తొమ్మిదేళ్లలో మూడు ఫార్మాట్లలో కలిపి 500 వికెట్లు తీసుకుని, ఆ క్లబ్ లో చేరిపోయాడు. ఈ ఘనత సాధించిన ఏడో సౌతాఫ్రికా బౌలర్ గా గుర్తింపు పొందాడు. స్ఫూర్తిమంతమైన క్రికెట్ ఆడిన ఆటగాడిగ రబాడ గుర్తింపు పొందాడు.