అమ్మమ్మ ఊరి నుంచి ఇంటికి వచ్చేందుకు బస్సు ఎక్కిన బాలిక అదృశ్యం అయింది. ఈ సంఘటన కరీంనగర్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ కనుకుంట్ల నర్సింహంకు కనుకుంట్ల వశిస్ట క్రిష్ణ (13) అనే కుమార్తె ఉంది.
పాఠశాలలకు రెండు రోజులు క్రిస్మస్ సెలవులు ఉండటంతో అమ్మమ్మ ఊరు పెద్దపల్లికి వెళ్ళింది. సెలవులు పూర్తవ్వడంతో బుధవారం ఉదయం వశిస్ట తాతయ్య పెద్దపల్లిలో బస్సు ఎక్కించి కరీంనగర్ కు పంపాడు. తాతయ్య అమ్మాయి తండ్రికి బస్సు నెంబర్ మెసేజ్ చేశాడు. కరీంనగర్ మంచిర్యాల చౌరస్తా స్టేజి దగ్గర తండ్రి అమ్మాయి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనే బస్సు వచ్చింది కానీ అమ్మాయి బస్సులో నుంచి రాలేదు. కండక్టర్ను అడగగా అమ్మయి బైపాస్ లోనే దిగింది అని చెప్పాడు.
వెంటనే నర్సింహం బండి పై బైపాస్ దగ్గర వెళ్లి చూడగా అమ్మాయి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలిస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమ్మాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ అమ్మాయి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే (9166879579) నంబర్ కు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.