హైదారాబాద్ శివారు ప్రాంతాలు, హైవేలను.. పొగమంచు కప్పేస్తుంది. మంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనం దగ్గరకు వచ్చినా సరే కనిపించని పరిస్థితి ఎదురవుతోంది. లైట్లు వేసుకుని వెళ్లినా ఎదురుగా ఏముందో కనిపించడంలేదు. దీంతో నిత్యం రోడ్డుపై ప్రయాణించేవారి పరిస్థితి దారుణంగాతయారైంది. దీంతో విపరీతంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఢిల్లీ సహా ఉత్తరాదిన పొగమంచు కమ్మేసింది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉంది. ఫాగ్ లైట్లు ఉపయోగించాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయంఏర్పడుతోంది. అయితే ఇప్పటికే ఢిల్లీలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
పొగమంచు కారణంగా ప్రమాదాలు జరగడం మాట అటుంచితే.. అనారోగ్య సమస్యలు దరిచేరతాయని వైద్యులు చెబుతున్నారు. బయటకు వచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.