కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. తాము అధికారంలోకి వస్తే.. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీ స్కీంలను అమలు చేస్తానని హామీ ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నేపథ్యంలో.. ఇవాళ్టి నుంచి ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం జనవరి 6 వరకూ కొనసాగనుండగా.. ఈ ప్రోగ్రాంలో లబ్దిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకుగాను ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది సర్కార్.
6 గ్యారెంటీల అమలే ధ్యేయంగా సాగుతున్న ప్రజాపాలనలో గ్రామ, వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఒక్క దరఖాస్తులోనే 6 గ్యారెంటీ పథకాలు అమలు చేసుకునే వెసులుబాటు ఉండటంతో మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు సంబంధించి అప్లికేషన్లు అందజేస్తున్నారు. అలాగే రేషన్కార్డు లేని వారు కొత్త రేషన్ కార్డుల కోసం కూడా అప్లై చేసుకుంటున్నారు.
ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన కార్యక్రమం కోసం సీనియర్ IAS అధికారులను జిల్లాలకు నోడల్ ఆఫీసర్లుగా నియమించింది ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 6 జోన్లలో ప్రజాపాలన అమలు కోసం IAS అధికారులను నియమించింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 600 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే 30 సర్కిల్స్లో 30 మంది స్పెషల్ ఆఫీసర్స్, 10 వేల మందికిపైగా సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.