SA vs IND Boxing Day Test : ఎన్నో అంచనాల మధ్య టెస్ట్ సిరీస్ విజయం సాధించి సగర్వంగా ఇండియాకి తిరిగి వెళ్లాలని భావించిన టీమ్ ఇండియా ఆశలు అంత తేలికగా నెరవేరేలా కనిపించడం లేదు. రెండోరోజు 8 వికెట్ల నష్టానికి 208 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ కి 37 పరుగులు జోడించి 245 పరుగుల వద్ద టీమ్ ఇండియా ఆలౌట్ అయ్యింది. అద్భుత సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ (101) ఆఖరి వికెట్టుగా వెనుతిరిగాడు.
తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా టీమ్ ఇండియా బౌలర్లను ఎదుర్కొంటూ బరిలో నిలిచింది. పై చేయి సాధించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. వెలుతురు సరిగా లేని కారణంగా ఆటను 66 ఓవర్ల వద్ద ఆపేశారు. ప్రస్తుతానికి 11 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా ఉంది.
ఇంకా క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ డీన్ ఎల్గర్ 140 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. అతనికి తోడుగా మార్కో జాన్సన్ (3) క్రీజులో ఉన్నాడు. వీరిలో ఎల్గర్ ని ఎంత త్వరగా అవుట్ చేస్తే టీమ్ ఇండియాకి అంత మంచిదని చెప్పాలి. లేదంటే టెయిల్ ఎండర్స్ ని అడ్డం పెట్టుకుని సాధ్యమైనంత వరకు స్కోరుని పెంచే అవకాశాలున్నాయి. 100 పరుగులు అధికంగా వచ్చినా, అవి టీమ్ ఇండియాకి సెకండ్ ఇన్నింగ్స్ లో భారమనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా మూడు రోజుల ఆట మిగిలే ఉంది.
అయితే బౌలింగ్ పిచ్ పై సౌతాఫ్రికా బౌలర్లు సంధించినట్టు, టీమ్ ఇండియా బౌలర్లు బాల్స్ వేయలేకపోయారు. కాకపోతే వీరిలో ఎల్గర్ ఒక్కడే ఆడుతున్నాడు. మిగిలిన వారిలో డేవిడ్ బెడింగ్ హోమ్ (56) చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీయడం టీమ్ ఇండియాకి పెను సవాల్ గా మారిపోయింది. ఎట్టకేలకు సిరాజ్ డేవిడ్ ని బౌల్డ్ చేసి, ఆ ఫెవికాల్ బంధాన్ని విడదీశాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్ కి 131 పరుగులు జోడించారు.
అయితే ఆట ప్రారంభమైన వెంటనే ఓపెనర్ మార్ క్రమ్ (5) త్వరగానే అయిపోయాడు. తర్వాత టోనీ డి జోర్జి (28), కీగన్ పీటర్సన్ (2), వెరినే (4) పరుగులు చేసి అవుట్ అయ్యారు. టీమ్ ఇండియా బౌలర్లలో బుమ్రా 2, సిరాజ్ 2, ప్రసిద్ధ్ 1 వికెట్లు తీశారు. ఇంకా అశ్విన్, శార్దూల్ ఠాకూర్ లకు వికెట్లు పడలేదు.
ఫాస్ట్ బౌలింగ్ పిచ్ కావడంతో అశ్విన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. వికెట్లు రాకపోయినా, పరుగులను నియంత్రించగలిగాడు. 8 ఓవర్లు వేసి కేవలం 19 పరుగులు ఇచ్చాడు. అందులో 3 మెయిడిన్ ఓవర్లున్నాయి. కానీ ఎందుకో రోహిత్ శర్మ అశ్విన్ చేతిలో బాల్ పెట్టలేదు. ఎక్కువ ఫాస్ట్ బౌలర్లపై ఆధారపడ్డాడు.
మూడోరోజు త్వరత్వరగా వికెట్లు పడగొట్టి, సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకి కట్టడి చేయాలి. ఈసారి టీమ్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశ్వసి జైశ్వాల్, తర్వాత గిల్ వరుసగా ఆడితే తిరుగుండదని, జయం మనదేనని అంటున్నారు.