కాంగ్రెస్ పార్టీ నేడు 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్పూర్లో భారీ సభకు పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలైన.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీలతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కూడా హాజరు కానున్నారు. అలాగే పార్టీ సీనియర్ నేతలతో పాటు ఇండియా కూటమి నేతలు సైతం పాల్గొననున్నారు. త్వరలోనే లోక్సభ ఎన్నికలు రానున్న తరుణంలో ఏఐసీసీ ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది.
కాగా ఈ ఆవిర్భావ దినోత్సవ సభకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తరలి వెళ్తున్నారు. సుమారు 10 లక్షల మంది ఈ సభలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుండగా.. తెలంగాణ నుంచి 50 వేల మంది కార్యకర్తలు వెళుతున్నట్లు సమాచారం అందుతుంది. ప్రతి నియోజకవర్గం నుంచి సభకు వెళ్లే కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది.
ఇక ఈ సభను విజయవంతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. సభకు జనసమీకరణ కోసం మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో సభకు తరలి వెళ్లనున్నారు. అలాగే సభకు సీఎం రేవంత్, మంత్రులు ప్రత్యేక విమానంలో నాగ్ పూర్ చేరుకోనున్నారు.
మరోవైపు గాంధీభవన్లో ఈరోజు ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. అయితే ఆయన నాగ్పూర్కు వెళ్తున్నందున టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. సేవాదళ్ ఆధ్వర్యంలో గాంధీభవన్ నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరా భవన్ వరకు ర్యాలీ చేయనున్నారు.