Koppula Eshwar: గురువారం నాటి సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఎంత సంచలనం అయిందో.. అదే వేదికపై మంత్రి కొప్పుల ఈశ్వర్ కు అవమానం జరిగిందంటూ అదే స్థాయిలో రచ్చ నడుస్తోంది. కొప్పులను సీఎం కేసీఆర్ చెయ్యి పట్టుకొని లాగుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దళితుడైన మంత్రిపై దొర దౌర్జన్యం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కొప్పుల ఎపిసోడ్ లో బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ లో స్పందించారు. ‘దోపిడి దొరల గడీలలో అవమానాలు భరిస్తూ బానిసలుగా ఉండాల్నో.. మన గుడిసెల్లో రాజులుగా బతకాలో నిర్ణయించుకోవాల్సింది మీరే’ అంటూ ట్వీట్ చేశారు ప్రవీణ్ కుమార్.
అసలేం జరిగిందంటే..
గురువారం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ కు వచ్చిన వారిలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఓవైపు కూర్చోవాలని సూచించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాత్రం ఎమ్మెల్యేలు కూర్చున్న వైపే ఉండటంతో ఆయన్ను చేయి పట్టుకొని మంత్రులు కూర్చున్న వైపు లాగేశారు కేసీఆర్. ఆ విజువల్స్ ను చూపిస్తూ దళిత మంత్రికి అవమానం అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.
ఘటనపై కొప్పుల క్లారిటీ..
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు. తనను సీఎం కేసీఆర్ అవమానించారనే ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యేల వైపు ఉన్న తనను మంత్రుల వైపు రావాల్సిందిగా కేసీఆర్ కోరారని.. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ తనకు తండ్రిలాంటి వారంటూ.. సోషల్ మీడియా నుంచి ఆ వైరల్ వీడియోలను డిలీట్ చేయాలని కోరారు. ఆ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్.