మధ్యప్రదేశ్లో రహదారులు రక్తమోడాయి. బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గుణ జిల్లాలో ఓ ట్రక్కును బస్సు ఢీకొనడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బుధవారం రాత్రి బస్సు గుణ నుంచి ఆరోన్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి 8.30గంటల ప్రాంతంలో గుణ జిల్లాలో ప్రైవేటు బస్సు..ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో బస్సు బోల్తాపడింది. అనంతరం బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 13 మంది సజీవదహనమైనట్లు ఆ జిల్లా కలెక్టర్ వెల్లడించారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మంటల్లో చిక్కుకున్న పలువురు ప్రయాణికులను రక్షించి ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ విచారణకు ఆదేశించారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను ఆదేశించారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 4లక్షలు చొప్పున.. క్షతగాత్రులకు 50వేల చొప్పున పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.