EV Scooters : ఎలక్ట్రిక్ స్కూటర్ (ఈవీ) కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడాల్సిన తరుణమిది. మోడల్ మారనున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థలు రాయితీలు ప్రకటిస్తూ, విక్రయాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో పెట్రోలు స్కూటర్ల ధరకే ఈవీ వచ్చేస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, ఈవీలు కొనాలనుకుంటే త్వరపడండి.
వేలల్లో రాయితీలు..
విద్యుత్ వాహనాలను తయారు చేసే స్టార్టప్ నుంచి ప్రముఖ సంస్థల వరకు రాయితీలను ప్రకటించాయి. ఏథర్ తన 450ఎస్, 450ఎక్స్ మోడల్ స్కూటర్లపై రూ.24వేల వరకు రాయితీతో పాటు కార్పొరేట్ డిస్కౌంట్ ప్రయోజనాలను కల్పించింది.
క్రెడిట్ కార్డులతో కొంటే..
ఓలా విద్యుత్ స్కూటర్ల సంస్థ తన ఎస్1ఎక్స్పై రూ.20వేల వరకు రాయితీ ప్రకటించింది. అంతేకాకుండా వివిధ క్రెడిట్ కార్డుల చెల్లింపులపై రూ.5,000 అదనపు తగ్గింపును ఇస్తోంది. వీటికి 6.99 శాతమే వడ్డీ రేటు వర్తిస్తుందని ప్రకటించింది.
5.99% వడ్డీతో
హీరో మోటోకార్ప్ తన విడా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్పై ఈఎంఐ, బ్యాటరీ వారంటీ, రాయితీ, బదిలీ బోనస్, లాయల్టీ, కార్పొరేట్ వంటి అన్ని ప్రయోజనాలతో కలిపి రూ.38,500 భారీ రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది వాహన కొనుగోలుకు 5.99% వడ్డీకే రుణాన్ని అందిస్తోంది.
ప్రభుత్వ సబ్సీడీ..
ఎలక్ట్రిక్ వాహనాలకు ఇస్తున్న సబ్సిడీని ప్రభుత్వం ఉపసంహరించుకుంటే వీటి ధరలు 25% వరకు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి, ఈవీ కొనాలనుకువారు ఈ నెలాఖరులోపు కొంటే.. ప్రభుత్వ సబ్సీడీతో వివిధ తగ్గింపుంతో తక్కువ ధరకే వస్తాయి.