Stock Market: ముంబైలోని ఫోర్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ లోని దలాల్ స్ట్రీట్ బుధవారం లాభాలతో కళకళలాడుతోంది. గతవారం రెండురోజులు లాభాల బాటలో ఉన్న నిఫ్టీ.. ఆ తర్వాత కాస్త నెమ్మదించింది. బుధవారం ఉదయం ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. HDFC బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ వంటి ప్రధాన షేర్ల అండతో నిఫ్టీ ఆల్ టైం గరిష్ఠాలకు చేరింది.
మంగళవారం 21,441 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ.. బుధవారం ఉదయం 21,497.65 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 12.10 గంటలకు 21,603.40 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని అందుకుంది. 12.30 గంటలకు కాస్త క్షీణించి 21,530 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 359 పాయింట్ల లాభంతో 71,697 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ లో అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.