CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారంటీల్లో రెండు అమల్లోకి తీసుకొచ్చింది. మిగిలిన గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయడానికి సన్నద్ధమవుతోంది. తాజాగా మరో కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ సచివాలయంలో అభయహస్తం దరఖాస్తులు విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ పాల్గొన్నారు. గురువారం నుంచి ప్రజాపాలనలో ఐదు పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తారు. 5 పథకాలకు జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
ప్రజలకు దగ్గరకు ప్రభుత్వమే వెళుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని స్పష్టంచేశారు. వారంలో రెండు రోజుల పాటు ప్రజావాణి కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. ప్రజావాణిలో ఇప్పటివరకు 24 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. భూములు, ఇళ్లు లేని వారు, ఆరోగ్యశ్రీ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. ఫిర్యాదులను అధికారులకు పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.ప్రతి మండలానికి తహసీల్దార్ బాధ్యత వహిస్తారని స్పష్టం చేశారు.ప్రతి అధికారి రోజూ రెండు గ్రామాలను సందర్శిస్తారని సీఎం తెలిపారు.
ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 8 పని దినాల్లో గ్రామసభల ద్వారా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరిస్తామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తామని చెప్పారు.