మంచిర్యాల జిల్లా మందమర్రిలో తల్లి కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చెన్నై నుంచి వలస వచ్చిన మురుగన్- ధనలక్ష్మి దంపతులు ఇక్కడ పాపుడాలు, చెకోడీలు తయారు చేసి విక్రయిస్తూ.. జీవనం సాగిస్తున్నారు. పని నిమిత్తం మురుగన్ బయటకు వెళ్లగా.. గత అర్థరాత్రి.. ధనలక్ష్మి (36), ఆమె కూతురు జీవని (16) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ధనలక్ష్మి కొడుకు సిద్ధు.. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నా గమనించలేదు. ఉదయం లేచి చూసేసరికి.. తన తల్లి, సోదరి ఉరికి వేలాడుతూ కనిపించడంతో ఖంగుతిని.. సొమ్మసిల్లి పడిపోయాడు. తేరుకున్నాక బంధువులకు సమాచారం ఇవ్వడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాపారం ముగించుకున్నాక ఇంటికి తిరిగొచ్చే మురుగున్.. ఇంతవరకూ ఇంటికి రాకపోగా.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దాంతో అతనిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధనలక్ష్మి, జీవని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. వీరిద్దరిదీ ఆత్మహత్యేనా..? లేక మురుగన్ ఏమైనా చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.