తెలంగాణ హోంశాఖలో ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క. కొత్త ప్రభుత్వం ఏర్పడినా కొందరు పోలీసులు పాత మోడ్లోనే ఉన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ (friendly Policing) పేరు చెప్పి ఇష్టారాజ్యంగా పనిచేస్తుండడంతో గ్రేటర్ హైదరాబాద్(greater hyderabad) పరిధిలో ఎస్ఐ, సీఐ అని లేదు. వరుసగా వేటు పడుతోంది.
పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సస్పెండ్ అయ్యారు. రోడ్డు ప్రమాదం నుంచి మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని తప్పించడమే అందుకు కారణం. పోలీస్ స్టేషన్కు వచ్చి విడిపించుకుపోయారంటే వాళ్లకు ఎంత ధైర్యం? కంచే చేను మేసినట్టు ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు విచారణ చేసి.. అతని పాత్ర నిర్ధారణ అయ్యాక వేటు వేశారు. అటు బీపీ డౌన్ అయిందంటూ దుర్గారావు ఆస్పత్రిలో చేరారు.
అది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఘటన. ఇప్పుడు సైబరాబాద్ (Cyberabad Commissionerate) పరిధిలో జరిగిన వేటు కథ చూద్దాం. మియాపూర్ ఎస్సై గిరీష్ కుమార్ ను సీపీ అవినాష్ మహంతి(cp avinash mahanti) సస్పెండ్ చేశారు. ఓ కేసు విషయంలో తన దగ్గరకు వచ్చిన మహిళను ట్రాప్ చేసి లైన్లో పెట్టడమే అందుకు కారణం. గిరీష్ కుమార్ పై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ సరైన ఆధారాలు దొరకలేదు. కానీ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ దొరికిపోయారు. విచారణ చేసిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి శిక్షించారు.
మరోవైపు.. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పీఎస్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కూడా డిపార్ట్మెంట్లో కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరగా.. ప్రణీత్ను చితక బాదారు. నడవలేని పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని సీపీ మహంతి ఆదేశించారు.