కాంగ్రెస్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. ఢిల్లీ కేంద్రంగా ఇప్పుడు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. ఇన్నాళ్ల పాటు గులాబీ నేతల మాటల దాడులపై మౌనంగా ఉన్న కాంగ్ పెద్దలు సైలెంట్గా తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారా? ఇంతకీ కారు పార్టీ నేతల బెదిరింపులకు కాంగ్రెస్ వేస్తున్న స్కెచ్ ఏంటి?
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు ఒకే పాట ఎత్తుకున్నారు. ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందని. నేతలు వేరు వేరైనా కారు పార్టీ నేతల నోటి నుంచి వచ్చింది ఈ మాటే అని చెప్పాలి. ఒక్క బీఆర్ఎస్ నేతలు మాత్రమే కాదు.. బీజేపీ నేతలది కూడా ఇదే రాగం. త్వరలోనే రేవంత్ సర్కార్ కూలిపోతుందని.. ఆ పార్టీలో ఉన్న అసమ్మతి కాంగ్రెస్ సర్కార్ను కూల్చేస్తోందంటూ జోస్యం చెప్పారు. కానీ సీఎం అభ్యర్థి నుంచి మంత్రుల వరకు ఎలాంటి విబేధాలు లేకుండా చాలా పద్ధతిగా.. ప్రజాస్వామ్యబద్ధంగా అందరి అంగీకారంతో తేల్చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు సొంత పార్టీ కూర్పుపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై నజర్ పెట్టింది. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్పైనే మెయిన్గా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.
ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభత్వాన్ని కూల్చడం కాదు.. అసలు బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందంటున్నారు కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ. పక్క పార్టీల సంగతి అటుంచి.. సొంత పార్టీ గురించి కాస్త పట్టించుకోండి అంటూ చురకలు అంటించారు ఆమె. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీని గెలిపించేడమే కాదు.. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు దీపాదాస్. మరోవైపు బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అన్న కాంగ్రెస్ ప్రచారం ఇప్పుడు నిజమవుతున్నట్టు కనిపిస్తోంది. దీనికి నిదర్శనం BRS ఎమ్మెల్సీ కవిత మారుతున్న స్వరం. ఆమె చేస్తున్న ట్వీట్లు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. సడెన్గా హిందూత్వవాదాన్ని వినిపిస్తున్నారామె. బీజేపీ నేతల కంటే ఎక్కువగా డోసు పెంచేస్తుండడం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది.
అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన కోట్లాది మంది కల అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇందులో కొత్తదనం కానీ, అభ్యంతరాలు కానీ లేకపోయినా.. తమిళనాడులోని డీఎంకే నేతలను ప్రశ్నిస్తున్నారామె. సనాతన ధర్మంపై డీఎంకే నేతలు కామెంట్లు చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడరని నిలదీస్తున్నారు. రాహుల్ను టార్గెట్ చేయడం ద్వారా బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవాలన్న తాపత్రయమే కవితలో కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది.
కవిత వినిపిస్తున్న హిందూత్వ వాదానికి, లిక్కర్ కేసులు లింక్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఈడీ హడావుడి చేసింది. తర్వాత అంతా సైలెంట్ అయిపోయింది. రాష్ట్రంలో అధికారం దూరమైన నేపథ్యంలో భవిష్యత్లో చిక్కులు రాకుండా ఉండాలంటే బీజేపీకి దగ్గరవ్వాలనే వెర్షన్ను బీఆర్ఎస్లో కొందరు వినిపిస్తున్నారు. అందులో భాగంగానే కవిత ట్వీట్లు చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న కాంగ్రెస్ నేతలు.. బీజేపీ-బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నామని చెబుతున్నారు.
.
.