వై నాట్ 175 అంటూ వచ్చే ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రస్తుతం పవనాలు ఏ మాత్రం అనుకూలంగా వీయడం లేదని తెలుస్తోంది. ఓ వైపు పలు రంగాల కార్మికుల సమ్మెలు, పార్టీలో అసమ్మతులు, ఏకమైన ప్రత్యర్థులతో పాటు కొత్తగా ఒకప్పుడు తాను వదిలిన బాణమైన షర్మిల.. ఇప్పుడు తిరిగి తనవైపే దూసుకొస్తుందన్న ప్రచారం ఏ మాత్రం కూడా కలిసివచ్చే అంశం కాదనే చెప్పాలి.
ఎన్నికలకు మరో మూడు నెలల సమయం కూడా లేదు. ఇదే సమయంలో కార్మికులు సమ్మె బాట పడుతున్నారు. ఇప్పటికే అంగన్వాడీ కార్మికులు అనేక రోజులుగా తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ సమ్మెకు దిగారు. ఇప్పుడు వారికి తోడుగా.. జగన్ సర్కార్ను మరింత ఇరుకున పెట్టేలా మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెకు దిగారు. ఇలా సమ్మె చేసే వారు ఇక్కడితో ఆగుతారా? లేక మరికొన్ని రోజుల్లో మరికొన్ని రంగాలు సమ్మె సైరన్ మోగిస్తారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.
దీనికి తోడు సీఎం జగన్ సొంత పార్టీలోనే ఇప్పుడు ముసలం ప్రారంభమైందనే ప్రచారం కూడా పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే ఏ నియోజవర్గంలో ఎవరి సత్తా ఎంతా అన్న విషయంలో పలు సర్వేలు చేయించిన సీఎం జగన్.. దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు మొదలుపెట్టారు. కొందర సైలెంట్గా ఉన్నా చాలా మంది మాత్రం తమను పక్కన పెట్టడం లేదా వేరే నియోజకవర్గానికి మార్చడంపై లోలోపల రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు తమ నిరసనను పార్టీ పెద్దల ముందు ఏకరువు పెడుతున్నట్టు తెలుస్తోంది. మరికొందరు మాత్రం ఇప్పటికే ఇతర పార్టీల వైపు చూడటం మొదలు పెట్టేశారు.
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గద్దె నెక్కడంతో కీలక పాత్ర వైఎస్ షర్మిలది. అన్న కోసం చేయాల్సిందంతా చేసింది ఆమె. కానీ గెలుపు తర్వాత అన్నా చెల్లెల్ల మధ్య గ్యాప్ రావడం.. ఆమె ఏపీని వదిలి తెలంగాణకు రావడం జరిగిపోయింది. కానీ ఇప్పుడామే మళ్లీ ఏపీ వైపు చూస్తోంది. అన్నకు వ్యతిరేకంగా అడుగులు వేస్తూ కాంగ్రెస్ పగ్గాలను చేపట్టి.. అన్నపై యుద్ధాన్ని ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో తెర వెనుక మంతనాలు కూడా జరిగిపోయాయని తెలుస్తోంది.
వీటన్నింటిని పక్కన పెడితే విపక్షాలైన టీడీపీ, జనసేన సీఎం జగన్కు వ్యతిరేకంగా చేతులు కలిపి ఉమ్మడిగా బరిలోకి దిగడం YSRCP ఏమాత్రం కూడా కలిసి వచ్చే అంశం కాదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఈసారి చీలే ప్రసక్తే లేకుండా అడుగులు వేస్తున్నాయి ఈ రెండు పార్టీలు. దీనికోసం ఏ త్యాగానికైనా సిద్ధపడేందుకు రెడీగా ఉన్నాయి.
ఇలా ఏరకంగా చూసుకున్నా.. ఏ రంగంలో చూసుకున్నా ప్రస్తుత పరిస్థితులు మాత్రం అధికార పార్టీకి అనుకూలంగా లేవు. మరి వీటన్నింటిని తట్టుకొని వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వీస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.