APPSC 2023: ఏపీ ఎడ్యుకేషన్ సర్వీసులో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులను ఏపీ ప్రభుత్వం భర్తీ చేయనుంది. జనవరి 9 నుంచి 29వ తేదీ రాత్రి 11.59 నిమిషాల వరకూ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. అభ్యర్థుల అర్హతలు, పోస్టుల వివరాలిలా ఉన్నాయి.
జోన్ల వారీగా ఖాళీలను చూస్తే.. జోన్ 1 లో 7, జోన్ 2 లో 12, జోన్ 3లో 8, జోన్ 4లో 11 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో బీఈడీ ఉత్తీర్ణతతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ లేదా సెకండ్ క్లాస్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్థుల వయసు జులై 1, 2023 తేదీ నాటికి 42 సంవత్సరాలు మించరాదు. 18-42 ఏళ్ల మధ్య వయసు వారు దరఖాస్తులకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు వయసు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ.370 కట్టాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ,ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.61,960 నుండి రూ.1,51,370 వరకూ జీతం చెల్లిస్తారు.
స్క్రీనింగ్ పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష రాసేందుకు 150 నిమిషాలు (2.30 గంటలు) సమయం ఇస్తారు.
మెయిన్స్ పరీక్ష మొత్తం 3 పేపర్లకు ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150/150, పేపర్ 2లో ఎడ్యుకేషన్ 1 సబ్జెక్ట్ లో 150/150, పేపర్ 3లో ఎడ్యుకేషన్ 2 సబ్జెక్టులో 150/150 మార్కులు ఉంటాయి. ఏప్రిల్ 13న స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది. మరిన్ని వివరాలకు https://psc.ap.gov.in/UI/CandidateLoginPages/OTPR_Main_Page.aspx ను సందర్శించండి.