Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల. ప్రస్తుతం ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫుల్ హల్చల్ చేస్తోంది. ఎందుకంటే జగనన్న వదిలిన బాణం.. తిరిగి అన్నపైకే ఎక్కు పెట్టింది. ఎన్నికలకు మరో మూడు నెలలు ఉండగానే.. ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అందుకు ప్రధాన కారణం వైఎస్ షర్మిల. అదేంటి షర్మిల తెలంగాణ రాజకీయాలకు వెళ్లిపోయారు కదా.. అంటే అవును వెళ్లారు.. కానీ మళ్లీ తిరిగి వస్తున్నారు అనేది ఆమె సన్నిహితులు చెబుతున్న మాట. తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తు అంతలా కనిపించకపోవడంతో షర్మిల ఏపీ వెళ్లాలని చూస్తుందని కొద్దినెలలుగా టాక్ వినిపిస్తోంది. అందుకే ఏపీ కాంగ్రెస్ సారథిగా బాధ్యతలు తీసుకుంటుందని.. అదే జరిగితే జగన్ పార్టీకి పెద్ద నష్టమే జరుగుతుందని అంతా భావిస్తున్నారు.
Sharmila : ఏపీలో రాజకీయం మారిపోనుందా? ఏపీలో అట్టడుగు స్థానానికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి జీవం పోసుకోనుందా? దీని కోసం ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్నే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పుడు ఆయనపైనే ఎక్కుపెట్టనుందా? అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలను వైఎస్ షర్మిలకు అప్పగించేందకు రంగం సిద్ధమైందనే ప్రచారం జరగుతోంది. దీనికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపరేషన్ వేగంగా జరుగుతున్నట్టు సమాచారం.
వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే ఏపీ పాలిటిక్స్లో ఓ కుదుపు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి పనిచేసిన నేతలను తీసుకురావడమే కాదు.. అన్న పార్టీ అయిన వైసీపీలోని అసంతృప్తులను తనవైపు తిప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
తల్లి విజయమ్మ విజ్ఞప్తితో ఇన్నాళ్లూ అన్నకు వ్యతిరేకంగా ఎలాంటి పావులు కదపలేదు షర్మిల. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తల్లికిచ్చిన మాటను పక్కన పెట్టి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. షర్మిలకు ఏపీ పాలిటిక్స్పై ఓ క్లారిటీ ఉంది. గతంలో ఆమె ఏపీ వ్యాప్తంగా 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు.
అంతేకాదు గత కొన్నాళ్లుగా అన్న వైఎస్ జగన్కు చాలా దూరంగా ఉంటున్నారు షర్మిల. మాజీ మంత్రి, బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా షర్మిల అడుగులు జగన్కు వ్యతిరేకంగానే పడ్డాయనే చెప్పాలి. తమ్ముడు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐకి వాంగ్మూలమిచ్చి.. సునీతారెడ్డికి మద్దతు పలికారు షర్మిల. ఆస్తుల విషయంలోనూ అన్నతో విబేధాలు ఉన్నట్టు చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది.
కుటుంబ పరంగా చూసుకున్నా.. రాజకీయాల పరంగా చూసుకున్నా… ఏపీ పాలిటిక్స్లోకి షర్మిల ఎంట్రీ ఇస్తే మాత్రం రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.