Vyuham Movie Release : ఏపీ రాజకీయాలపై రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘వ్యూహం’. ఈ మూవీ రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఆయన వేసిన పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేయడంతో వ్యూహం రిలీజ్ పై సందిగ్ధత ఏర్పడింది.
‘వ్యూహం’ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని కోరుతూ నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. మూవీ రిలీజ్ చేయకుండా చిత్ర నిర్మాతను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ విచారణను ఉన్నత న్యాయస్థానం డిసెంబర్ 28కి వాయిదా వేసింది.
‘వ్యూహం’ ట్రైలర్ రిలీజ్ సమయంలో దర్శకుడు తనకు జగన్ అంటే ఇష్టమని చెప్పారని లోకేష్ పిటిషన్ లో ప్రస్తావించారు. చంద్రబాబు, పవన్కల్యాణ్ నచ్చరని వర్మ చెప్పారని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ వ్యూహం మూవీని తెరవెనక ఉండి తీయించారని ఆరోపించారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్, ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్, డైరెక్టర్ రామ్గోపాల్ వర్మను పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. వ్యూహం డిసెంబర్ 29న రిలీజ్ కావాల్సి ఉంది. ఈనేపథ్యంలో డిసెంబర్ 28 హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.