NRI Yashaswi : ఎన్నారై యశస్వి పాస్పోర్టును రిలీజ్ చేయాలని సీఐడీని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని యశస్విపై సీఐడీ కేసు నమోదు చేసింది. గత శుక్రవారం హైదరాబాద్లో అతన్ని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి 41ఏ నోటీసులు ఇచ్చింది. అరెస్టు చేసిన సమయంలో సీఐడీ పోలీసులు యశస్వి పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు. తన పాస్పోర్ట్ ఇప్పించాలని యశస్వి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. యశస్వి పాస్పోర్టు తిరిగి ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.
టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్త బొద్దులూరి యశస్విని ఏపీ సీఐడీ పోలీసులు గత శుక్రవారం అరెస్టు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అతన్ని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకొని గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకుగానూ ఆయనపై కేసు నమోదు చేశారు.