Thummala Nageswara Rao : ఖమ్మం జిల్లా బైపాస్ రోడ్లోని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా కార్యాలయానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలుపునకు మద్దతు ఇచ్చిన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, పార్టీ నేతలకు తుమ్మల ధన్యవాదాలు చెప్పారు. గిరిజనుల ఆత్మగౌరవ నిలబెట్టే విధంగా కాంగ్రెస్ పరిపాలన ఉంటుందని తుమ్మల పేర్కొన్నారు.
తుమ్మల మాట్లాడుతూ.. “నేను అటవీ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఆదివాసీల, గిరిజనుల కష్టాలు తెలుసు. అధికారం ఉన్నపుడు కొండ కోనల్లో ఉన్న అడవి బిడ్డల అభివృద్ధి కోసం పాటుపడ్డ. న్యూ డెమోక్రసీ బలంగా ఉన్న గుండాల, ఆళ్ళపల్లి మండలాల్లో మీ పార్టీ నేతలు నాకు సహకరించారు అది నేను ఎప్పుడు మర్చిపోనని” అన్నారు.
గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్య హక్కులు కాలరాసి నపుడు సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీ కాంగ్రెస్కు మద్దతుగా నిలిచిందని అన్నారు. ప్రశాంతమైన ప్రగతిశీల ఖమ్మం తన లక్ష్యమని తుమ్మల స్పష్టం చేశారు.