Hyderabad : హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద శనివారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ కారు.. ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాహన వేగానికి కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.ఈ నెల 23న అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమాజిగూడ రాజీవ్ సర్కిల్ నుంచి ప్రజాభవన్ మీదుగా బేగంపేట వెళుతున్న బీఎండబ్య్లూ కారు అతి వేగం కారణంగా అదుపుతప్పి ప్రజాభవన్ ముందు ఉన్న బారికేడ్లను ఢీ కొట్టింది. కారు ఆగగానే అందులో ఉన్న ఓ వ్యక్తి కారు దిగి పరారయ్యారు. మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. నిర్లక్ష్యంగా కారు నడిపిన అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే ప్రమాదానికి గురైన కారులో బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరో ముగ్గురు యువకులు ఉన్నట్లు సమాచారం. మరో ముగ్గురు యువతులు కూడా కారులో ప్రయాణించినట్టు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. కారు డ్రైవింగ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కుమారుడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి అతడిని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్కు పంపించారు పంజగుట్ట పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్కు తీసుకెళ్తుండగా.. అతను మరో కారు ఎక్కి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే నిందితుడిని కావాలనే తప్పించారా.. లేక తప్పించుకు పోయాడా అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాద సమయంలో బోధన్కు చెందిన మాజీ ప్రజాప్రతినిధి తనయుడు కారు నడిపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసు నమోదు సమయంలో అసలు నిందితుడిని తప్పించి మరొకరి పేరు చేర్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంజాగుట్ట పోలీసులు మాత్రం.. డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని వైద్యపరీక్షల నిమిత్తం ట్రాఫిక్ పోలీసులకు అప్పగించినట్టు చెబుతున్నారు. అసలు నిజం ఏంటనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులను నగర సీపీ శ్రీనివాస్రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది.