CM Revanth Reddy Delhi Tour : తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రధాని మోదీని తొలిసారి కలవనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
విభజన చట్టంలోని పలు పెండింగ్ అంశాలపై వారు చర్చించనున్నట్లు సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా.. తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు.. ఎఫ్ఆర్బీఎం సడలింపు వంటి విషయాలపై చర్చించనున్నారు. రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి.
సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కూడా కలవనున్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక గురించి చర్చించనున్నారు. ఇక తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ అంశాలపైనా చర్చించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ విస్తరణపై హై కమాండ్తో చర్చలు జరపనున్నట్లు సమాచారం.