SA vs IND : దక్షిణాఫ్రికాతో సెంచూరియన్లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ సందర్భంలో భారత జట్టును ఎన్నుకునేటప్పుడు ప్రధానంగా నాలుగు అంశాలు చర్చనీయాంశంగా మారాయి. అవే..
టాప్ ఆర్డర్
ఛెతేశ్వర్ పుజారా లేదా అజింక్యా రహానే లేకుండా టెస్ట్ మ్యాచ్ ఆడటం ఇది రెండో సారి. చివరగా 2012లో ఇండియాలో వీరివురు లేకుండా ఆడారు. ముఖ్యంగా మూడో స్థానం గురించి ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.
శుభ్మన్ గిల్ ఇప్పటివరకు ఆడిన 18 టెస్టుల్లో.. 16 మ్యాచ్ల్లో ఓపెనర్గా ఉండగా, రోహిత్ శర్మతో కలిసి 10 టెస్టుల్లో ఓపెనింగ్ చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో వెస్టిండీస్లో.. యశస్వి జైస్వాల్ రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేయడంతో అతను మూడవ స్థానంలో ఆడాడు. టెస్ట్ క్రికెట్లో జైస్వాల్ తన మొదటి మూడు ఇన్నింగ్స్లలో 171, 57, 38 పరుగులు చేశాడు. అదే రెండు టెస్టులలో గిల్ 6, 10, 29* పరుగులు మాత్రమే చేశాడు.
ఇది గిల్ను అస్పష్టంగా ఉంచింది. 18 టెస్టుల తర్వాత అతని సగటు 32.20 గా ఉంది. అతని రెండు టెస్టు సెంచరీలు ఫ్లాట్ ట్రాక్ల మీదే వచ్చాయి. బంగ్లాదేశ్తో చటోగ్రామ్లో.. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్లో గిల్ సెంచరీలు చేశాడు.
గత దక్షిణాఫ్రికా పర్యటనలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ మూడో స్ధానానికి సరిపోయే ఆటగాడు. అయితే అతను కీపింగ్ గ్లవ్స్ కూడా తీసుకుంటే కోలుకోవడానికి తక్కువ సమయం లభిస్తుంది.
వికెట్ కీపర్
కేఎల్ రాహుల్ తన కెరీర్లో నిర్ణీత వికెట్కీపర్గా కేవలం రెండు ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో మాత్రమే కీపింగ్ చేశాడు. ఒకవేల టీమిండియా కేఎస్ భరత్తో కలిసి వెళితే, గిల్ లేదా రాహుల్ 3వ స్థానంలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
బౌలింగ్ ఆల్రౌండర్
టీమిండియా సీమ్-ఫ్రెండ్లీ దేశాలకు వెళ్లినప్పుడు నంబర్ 8 ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది. టెస్ట్ గ్రేట్లలో ఒకరైన ఆర్ అశ్విన్ కంటే శార్దూల్ ఠాకూర్ను ఎంపిక చేయడానికి మొగ్గు చూపారు. మొదటి టెస్ట్లో మొదటి రెండు రోజులలో వర్షం సూచన ఉన్నందున శార్దూల్ ఠాకూర్ వైపే టీం మేనేజ్మెంట్ మొగ్గుచూపొచ్చు.
ఫాస్ట్ బౌలర్లు
జూలై 2022 తర్వాత జస్ప్రీత్ బుమ్రా తన మొదటి టెస్టు ఆడుతున్నాడు. అతనికి తోడుగా మహ్మద్ సిరాజ్ కొత్త బంతిని పంచుకోనున్నాడు. మహ్మద్ షమీ గాయపడటంతో, మూడో సీమర్ ఎంపిక జట్టుకు తలనొప్పిగా మారింది. ముఖేష్ కుమార్ లేదా ప్రసిద్ధ్ కృష్ణ మహ్మద్ షమీ స్థానంలో ఆడనున్నారు. నిటారుగా ఉండే సీమ్, కచ్చితత్వంలో షమీ లాంటి లక్షణాలను ముఖేష్ కలిగి ఉన్నాడు. వెస్టిండీస్లో అరంగేట్రం చేసిన ముఖేష్ కుమార్ వైపే టీం మేనేజ్మెంట్ మొగ్గుచూపే అవకాశం ఉంది.
ఇద్దరు స్పిన్నర్లతో వెళ్లాలనుకుంటే మూడో సీమర్గా ఠాకూర్ ఎంపికను కొట్టిపారేయలేం.