Dogs attack: కుక్కల దాడిలో ఐదు నెలల బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని షేక్ పేటలో చోటు చేసుకుంది. అంజి , అనూష అనే దంపతులకు ఐదు నెలల బాలుడు ఉన్నాడు. వారు వినోబానగర్ లో ఓ గుడిసెలో కూలి పని చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. తమ ఐదు నెలల బాబును గుడిసెలో పడుకోబెట్టి కూలి పనికి వెళ్ళారు.
ఇంతలో గుడిసెలోకి వీధి కుక్కలు చొరబడి బాబు పై దాడి చేశాయి. బాబు తల్లి వచ్చి చూసే సరికి.. రక్తపు మడుగులో కన్పించాడు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడి నుంచి నీలోఫర్ కు పంపిచారు. ఆ తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
17 రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాడి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో బాలుడు మృతి చెందాడు. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబు పై కుక్కల దాడి సీసీ టీవీలో రికార్డు అయ్యిందని పోలీసులు తెలిపారు. వీధి కుక్కలతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది వీధికుక్కలను నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.