Sunburn Festival: సన్బర్న్ కార్యక్రమంపై మాదాపూర్ పీఎస్లో కేసు నమోదైంది. ఈవెంట్ నిర్వాహకులతో పాటు బుక్ మై షో పై కూడా కేసు నమోదు చేశారు. పోలీసుల అనుమతి తీసుకోకుండా ఈవెంట్ ఏర్పాట్లు చేసుకోవడమే కాకుండా.. టిక్కెట్లు విక్రయించడంపై కేసు నమోదైంది. హైటెక్ సిటీలోనీ యోలో ఏరినాను ఈవెంట్ కోసం నిర్వాహకులు బుక్ చేశారు. అనుమతి లేకపోయిన టికెట్లు అమ్మకున్నారు. దీంతో ఈ వ్యవహరంపై రేవంత్ రెడ్డి సర్కారు సీరియస్ అయింది. గతంలోనూ న్యూ ఇయర్ సన్ బర్న్ కార్యక్రమం.. అనేక వివాదాలకు కారణమైంది.
ఈ ఈవెంట్లో అసాంఘిక కార్యకలాపాలకు అనుమతి ఇవ్వద్దంటూ 2017లోనే కాంగ్రెస్ ఆందోళన చేసింది. ఈవెంట్ కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి యువత హాజరవుతూ ఉంటారు. యువత ఆసక్తిని సన్ బర్న్ నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. ఆన్లైన్లో టికెట్ల అమ్మకంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుడు సుమంత్, బుక్ మై షో నిర్వాహకులను పిలిపించి సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటివరకూ పోలీసులు ఈవెంట్ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడంతో సన్బర్న్ కార్యక్రమంపై సందిగ్ధత నెలకొంది.