Migrants : మెక్సికో సరిహద్దుల్లో వేల సంఖ్యలో ప్రజలు రోడ్డుపైనే క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. వారంతా పొట్ట చేత పట్టుకుని అమెరికాలో ఆశ్రయం కోసం వెళ్తున్నవారే. ఇలా వలసలు చోటుచేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదే. అయితే 1970 తర్వాత అంతర్జాతీయంగా అధికసంఖ్యలో వలసదారులు అగ్రరాజ్యానికే చేరుకున్నారని వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్-2022 నివేదించింది.
అమెరికా గడ్డపై విదేశీయుల సంఖ్య ఐదు దశాబ్దాల్లో దాదాపు నాలుగింతలైంది. 1970లో 1.2 కోట్ల మంది అమెరికాకు వలస వెళ్లగా.. 2020 నాటికి ప్రవాసుల సంఖ్య 5 కోట్లకు చేరింది. అమెరికాలోని వలసదారుల్లో అత్యధికంగా మెక్సికన్లే. వారి సంఖ్య 1,08,53,105 అని ఆ నివేదిక తేల్చింది. భారత్(27,23,764), చైనా(21,84,110), ఫిలిప్పీన్స్ (20,61,178), ఎల్ సాల్వడార్ (14,10,659) దేశాల నుంచీ వలసల ప్రవాహం సాగింది.
ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ ఎక్కువగా ఉన్న దేశంగా జర్మనీ రెండో స్థానంలో ఉంది. ఆ దేశం 1.58 కోట్ల మందికి ఆశ్రయం కల్పించింది. 2000-2020 మధ్యకాలంలోనే వలసల సంఖ్య 89 లక్షల నుంచి 1.6 కోట్లకు చేరింది. పోలండ్(21,41,722) నుంచి జర్మనీకి ఎక్కువగా వలసలు సాగాయి. తుర్కియే(18,37,282), రష్యా (11,98,831), కజకిస్థాన్(11,28,201), సిరియా(7,07,457) దేశాల నుంచి జర్మనీకి ఎక్కువ మంది వలస వెళ్లారు.
మైగ్రంట్స్ అధికంగా ఉన్న మూడో దేశం సౌదీ అరేబియా. 2020లో 1.35 కోట్ల మంది వలసదారులకు ఆ దేశం నీడనిచ్చింది. వీరిలో అత్యధికంగా ఇండియా (25,02,337), ఇండొనేసియా (17,09,318), పాకిస్థాన్(14,83,737) నుంచి వెళ్లినవారే. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నందున సౌదీకి వలసలు పెరిగాయి. సౌదీకి క్యూ కట్టడానికి అక్కడ అధిక వేతనాలు లభించడం మరో కారణం.
రష్యా 1.16 కోట్ల మంది మైగ్రంట్స్కు షెల్టర్ ఇవ్వగా.. బ్రిటన్(94 లక్షలు), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(87 లక్షలు), ఫ్రాన్స్(85 లక్షలు), కెనడా(80 లక్షలు)కూ వలసజీవుల తాకిడి ఎక్కువగానే ఉంది.