Bihar: ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. కేజీఎఫ్ సినిమాలోని ఈ డైలాగ్ వింటే ఎవ్వరికైనా.. గూస్బంప్స్ రావాల్సిందే. నిజంగానే అంతటి సాహసోపేతురాలు కూడాను. ఆమె ప్రేమ, ఓదార్పు, ధైర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంట్లో ఎవరికైనా.. గోరంత కష్టమొచ్చినా తల్లడిల్లిపోతుంది. ఎలాంటి ఆపద రాకుండా కంటికిరెప్పలా నిత్యం కాపాడుతూనే ఉంటుంది. అలాంటిది తాను నవమాసాలు మోసిన బిడ్డకు ప్రాణాపాయం ఉందని తెలిస్తే మాత్రం తట్టుకోలేదు. ఎంతటి సాహసానికైనా వెనుకాడదు.
బీహార్లో ఓ తల్లి చేసిన సాహసం చూస్తే.. ఎవరికైనా రోమాలు నిక్కపొడుస్తాయి. బిడ్డలకోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి కాపాడుకుంది. బీహార్ రైల్వేస్టేషన్లో రైలు ఎక్కుతుండగా తోపులాటలో.. ప్రమాదవశాత్తు ఇద్దరు బిడ్డలతో సహా ఓ మహిళ కిందపడిపోయింది. ట్రాక్, ప్లాట్ఫారానికి మధ్యలో ఇరుక్కుంది. ఇక తనతో సహా బిడ్డల ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఆమె కళ్లెదుటే కనిపిస్తోంది. అయినా ఏమాత్రం బెదరలేదు. తన ప్రాణం పోయినా ఫర్వాలేదనుకుంది. ఎలా అయినా సరే బిడ్డలను కాపాడుకోవాలనుకుంది.
ఆస్ట్రేలియా జంతువు కంగారు.. తన సంతానాన్ని కడుపులో పెట్టుకున్నట్లు ఆ తల్లి కూడా తన బిడ్డలను పొత్తిళ్లలో పెట్టుకుని ముందుకు వంగి అలానే ఉండిపోయింది. ఫ్లాట్ఫారంపై ఉన్న ప్యాసింజర్లు, ఆర్పీఎఫ్ సిబ్బంది సైతం ఏమి చేయలేని స్థితిలో అలానే చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ట్రైన్ వేగంగా కదిలిపోయింది. ఇక ఇద్దరు చనిపోతారేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆ తల్లి చేసిన సాహసానికి విధి సైతం తలవంచక తప్పలేదు. ఆమె పై నుంచి అలానే ట్రైన్ వెళ్లిపోయింది. అయినా వారిద్దరికీ ఏమీ కాలేదు. తల్లి, బిడ్డలు.. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే అక్కడున్న సిబ్బంది తల్లి బిడ్డలను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.