Congress VS BRS : తెలంగాణ రాజకీయాలు శ్వేతపత్రం, స్వేద పత్రం చుట్టే తిరుగుతున్నాయి. మొన్నటివరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఒకటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, రెండోది విద్యుత్ లెక్కలపై. గత ప్రభుత్వం చేసిన అప్పులు.. కూడబెట్టామంటున్న ఆస్తులపై సభలో విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా గత పాలకులను కాంగ్రెస్ మంత్రులు తూర్పార పట్టారు. ఆ దెబ్బతో బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడిపోయింది. కౌంటర్ ఇవ్వకపోతే ప్రభుత్వం చెప్పిందే జనాల్లోకి వెళ్తుందని గ్రహించారు. అందుకే స్వేదపత్రం విడుదల చేసింది బీఆర్ఎస్. తెలంగాణ 6 లక్షల 70 వేల కోట్ల అప్పుల్లో ఉందని ప్రభుత్వం ఆర్థికశాఖపై విడుదల చేసిన శ్వేతపత్రంలో వివరించింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చేనాటికి 72 వేల 658 కోట్లుగా ఉన్న అప్పులు.. ప్రస్తుతం 6 లక్షల 70 వేల కోట్ల అప్పులకు చేరుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అంతేకాదు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదని.. కాయకల్ప చికిత్స చేస్తే తప్ప ఇది గాడిలో పడదని ఆయన వివరించారు.
శ్వేతపత్రాలకు కౌంటర్గా బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల చేసింది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే బీఆర్ఎస్ పాలనను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకా ఉందని.. అది అబద్ధాల పుట్ట అని ఆయన ఆరోపించారు. గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలోని ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ కేటీఆర్ తెలంగాణభవన్లో స్వేదపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 3 లక్షల 17వేల కోట్లు అని కేటీఆర్ చెబుతున్నారు. మరి ప్రభుత్వం అసెంబ్లీలో ఆరు లక్షల 71 వేల కోట్లు అని ప్రకటించింది. దీంతో ఇందులో ఏది నిజం అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులు వెల్లడించిన శ్వేత పత్రం సరైన కాదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న అప్పుల్లో లక్షల కోట్ల తేడా ఉందని వారు చెప్తున్నారు. అలాంటప్పుడు ఆ లక్షల కోట్లు ఎక్కడికి వెళ్లాయనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. మరోవైపు గతంలో ఉన్న ప్రభుత్వమేమో తాము అభివృద్ధి కోసమే అప్పులు చేశామని ప్రకటించింది. ఆ అప్పులతో ఆస్తులను పెంచామని చెప్పింది. అయితే అసెంబ్లీ సాక్షిగా లక్షల కోట్లల్లో తేడా కనిపిస్తుండడంతో ఇందులో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది అంతు పట్టకుండా ఉంది. ఉన్న ఆస్తులను కూల్చి కొత్తగా నిర్మించడమంటే విధ్వంసం చేసినట్టేనని సభలో మంత్రి కొండా సురేఖ గత ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. పాత సచివాలయాన్ని అలాగే ఉంచి దాన్ని ఓ హాస్పిటల్గా వాడుకున్న పోయేది కదా అంటున్నారు. కొత్త సచివాలయాన్ని వేరేచోట నిర్మించి ఉంటే ప్రభుత్వ ఖజానాపై భారం పడకపోయేది కదా అని గుర్తు చేశారు.
వాస్తవానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై అధికారులు శ్వేత పత్రం రూపొందిస్తారు. అయితే అంతకంటే ముందే అధికారంలో ఉన్న నాయకులు రూపొందించిన విధానాలను అధికారులు అమలు చేస్తారు. మరి లక్షల కోట్ల రూపాయలకు లెక్కలు తారు మారు చేసే సత్తా అధికారులకు ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే గతంలో ప్రభుత్వం చెప్పిన బడ్జెట్ లెక్కలనే ఇందుకు ప్రాతిపదికగా తీసుకున్నామని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. మొత్తంగా శ్వేతపత్రం, స్వేదపత్రం ఈ రెండింటిలో ఏ అంకెలు వాస్తవం అంటే కచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినవే నమ్మాలంటున్నారు విశ్లేషకులు.
.
.